పెరగనున్న వడగాడ్పులు
హీట్ వేవ్స్ రెడ్ జోన్లో తెలంగాణ
తొలి ఈహెచ్ఎఫ్ ఇండెక్స్లో ఐఎండీ హెచ్చరిక
ఏపీ సహా పలు రాష్ట్రాల్లోనూ వడగాడ్పులు తీవ్రం
టెంపరేచర్లు 40 డిగ్రీలు దాటితే హీట్ వేవ్స్ ముప్పు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో హీట్వేవ్స్(వడగాడ్పులు) పెరుగుతున్నయా? రానురాను అవి మరింత తీవ్రమవుతున్నయా? అంటే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అవుననే అంటున్నది. దేశవ్యాప్తంగా ఎండాకాలంలో హీట్స్ట్రెస్ను అంచనా వేసేందుకు ఐఎండీ ఇటీవల ఎక్సెస్ హీట్ ఫ్యాక్టర్(ఈహెచ్ఎఫ్) ఇండెక్స్ను ప్రారంభించింది. దీనికి సంబంధించి తొలి ఈహెచ్ఎఫ్ ఇండెక్స్ను కూడా విడుదల చేసింది. ఈ ఇండెక్స్ ప్రకారం హీట్ వేవ్స్కు సంబంధించి తెలంగాణ ‘రెడ్జోన్’లో ఉంది. 40 డిగ్రీలకుపైగా టెంపరేచర్లు నమోదైన రాష్ట్రాలను ఈహెచ్ఎఫ్ తీవ్రంగా ఉన్న రాష్ట్రాలుగా ఐఎండీ పేర్కొంది. రెడ్ జోన్ జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, యూపీ, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి.
వివిధ కారణాలతో ఇప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నందున రాబోయే రోజుల్లో వేడి తీవ్రత, వడగాడ్పుల ప్రభావం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈహెచ్ఎఫ్ సిస్టమ్ను ఆస్ట్రేలియాలో మొదటిసారిగా 2014 నుంచి అమలు చేస్తున్నారు. ఆ తర్వాత అమెరికా సహా పలు దేశాలు దీనిని ఫాలో అవుతున్నాయి. తాజాగా మన దేశంలోనూ ఐఎండీ దీనిని ప్రారంభించింది.
ఏమిటీ ఈహెచ్ఎఫ్?
ఎక్సెస్ హీట్ ఫ్యాక్టర్(ఈహెచ్ఎఫ్)ను రెండు రకాలుగా లెక్కిస్తారు. మొదటి విధానంలో.. ఒక ప్రాంతంలో నమోదైన మూడు రోజుల(త్రీ డే పీరియడ్: టీడీపీ) సగటు ఉష్ణోగ్రతను గడిచిన ఏడాది కాలంలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చి చూస్తారు. రోజువారీ ఉష్ణోగ్రతలు టీడీపీ సగటు కన్నా ఎక్కువగా, ఏడాది కాలంలో నమోదైన ఉష్ణోగ్రతల్లో 95 పర్సంటైల్ కన్నా ఎక్కువగా నమోదైతే ఆ ప్రాంతంలో హీట్వేవ్స్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు నిర్ధారిస్తారు. రెండో విధానంలో గడిచిన 30 రోజుల ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. టీడీపీ థ్రెషోల్డ్ ఎంత ఉందన్నది లెక్కిస్తారు. టీడీపీ థ్రెషోల్డ్ ఎక్కువగా వస్తే హీట్వేవ్స్ ఉన్నట్టుగా నిర్ధారిస్తారు. అంటే టీడీపీ థ్రెషోల్డ్ లిమిట్ సున్నా కన్నా ఎక్కువగా నమోదైనా.. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా ఎక్కువగా రికార్డ్ అయినా ఆ ప్రాంతంలో హీట్వేవ్స్ ముప్పున్నట్టు పరిగణిస్తారు. థ్రెషోల్డ్ లిమిట్ మైనస్లో వస్తే ముప్పు లేనట్టు అర్థం. ఈ లెక్కన ఈహెచ్ఎఫ్ థ్రెషోల్డ్ లిమిట్తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా, కర్నాటక, చత్తీస్ గఢ్లలో సున్నా కన్నా ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్టు ఐఎండీ వెల్లడించింది.
ఎందుకీ మోడల్?
ఇటీవలి కాలంలో వడదెబ్బ వల్ల మరణాలు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోనే ఒక్క నెలలో 20 మంది దాకా మరణించారు. అనధికారిక లెక్కల ప్రకారం వడదెబ్బ తగిలి మరణించిన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, తుఫాన్లు, వరదల కన్నా ఎక్కువగా వడదెబ్బతోనే జనం చనిపోతున్నారట. అందుకే.. హీట్వేవ్స్పై ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని అలర్ట్ చేసేందుకే అక్కడి ప్రభుత్వం ఈహెచ్ఎఫ్ మోడల్ను ఎంచుకుంది. దీనిద్వారా ఎప్పటికప్పుడు హీట్వేవ్స్ కండిషన్స్ను అంచనా వేస్తూ ప్రజలకు జాగ్రత్తలను చెప్తున్నది. ఇప్పుడు మన దేశంలోనూ ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఐఎండీ ఈహెచ్ఎఫ్ మోడల్ను తీసుకొచ్చింది.