న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వంతో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. తమ రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటు గురించి టెస్లా, బీవైడీలతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. లండన్లోని భారత హైకమిషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
ఈ రెండు సంస్థలతో సంప్రదింపులు ఏ దశలో ఉన్నాయనే విషయాన్ని సీఎం వెల్లడించలేదు. అయితే హైదరాబాద్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేయడానికి చైనాకు చెందిన బీవైడీ సంస్థకు కేంద్రం గత ఏడాది అనుమతి నిరాకరించింది. టెస్లా రెండు సంవత్సరాలుగా భారతదేశంలోకి ప్రవేశించాలని చూస్తోంది. గుజరాత్ సహా పలు రాష్ట్రాలు కూడా టెస్లాతో చర్చిస్తున్నట్టు ప్రకటించాయి.