హిందువులపై సడెన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది - బీజేపీ

హిందువులపై సడెన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది - బీజేపీ

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశ్ బొమ్మలు ప్రింట్ చేయాలన్న కేజ్రీవాల్ డిమాండ్ పై బీజేపీ స్పందించింది. ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఆ పార్టీ నేత సంబిత్ పాత్రా విమర్శించారు. కేజ్రీవాల్ కు హిందువులపై సడన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చిందో తెలియడం లేదన్నారు. హిందువుల ఓట్ల కోసమే అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేజ్రీవాల్ గతంలో కశ్మీర్ ఫైల్స్ మూవీని విమర్శించారనీ... స్వస్తిక్ గుర్తుని హేళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీపావళి నాడు హిందువులను జైలుకు పంపిన ఘనత కేజ్రీవాల్ దని సంబిత్ పాత్రా ఆరోపించారు. అయోధ్యలోని రామలయానికి వెళ్లడానికి నిరాకరించిన కేజ్రీవాల్.. ఇప్పుడు ఇలాంటి డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. 

భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కరెన్సీ నోట్లపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలను పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు.  మన కరెన్సీ నోట్లపై లక్ష్మీజీ , గణేష్‌జీ ఫోటో ఉంటే మన దేశం అభివృద్ధి చెందుతుందని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటికే ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మాగాంధీ ఫొటోను అలాగే ఉంచాలని చెప్పారు. ఆ చిత్రం పక్కన లక్ష్మీజీ, గణేషాజీల ఫొటోలను ముద్రించవచ్చని ఢిల్లీ సీఎం తెలిపారు.దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తానన్న కేజ్రీవాల్.. కొత్తగా ముద్రించే నోట్లపై ఈ బొమ్మలు ఉండాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.