- అమ్మకాలు తగ్గినా నిలకడగా జ్యువెలర్ల రెవెన్యూ
- 2023-24 లో 20 శాతం మేర పెరగనున్న స్టోర్ల సంఖ్య
- షార్ట్ టెర్మ్లో కొనసాగనున్న గోల్డ్ డిమాండ్ : ఇక్రా రిపోర్ట్
న్యూఢిల్లీ : గోల్డ్ రేట్లు పెరగడంతో అమ్ముడైన నగల విలువ కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లో ఇది 15 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరిగింది. అక్షయ తృతీయ వంటి పండుగల టైమ్లో బంగారు నగలకు డిమాండ్ కొనసాగడమే కారణం. కానీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో మాత్రం నగల అమ్మకాల గ్రోత్ ( వాల్యూ పరంగా) కేవలం 6-– 8 శాతం మాత్రమే ఉంటుందని ఇక్రా అంచనా వేస్తోంది.
గోల్డ్ రేట్లు పెరగడం వలన గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోయిందని పేర్కొంది. మొత్తంగా 2023–24 లో అమ్ముడయ్యే నగల విలువ 10–12 శాతం పెరగొచ్చని తెలిపింది. అమ్ముడయ్యే నగల విలువ 8–10 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసింది. తాజాగా తన అంచనాలను సవరించింది. కాగా, కిందటేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య తీవ్ర ఒడిదుడుకుల్లో కదిలిన గోల్డ్ రేట్లు, ప్రస్తుత ఆర్థిక సంత్సరంలోని మొదటి ఆరు నెలల్లో స్థిరంగా ఉన్నాయి. కిందటేడాది ఇదే టైమ్తో పోలిస్తే బంగారం ధరలు 14 శాతం వరకు పెరిగాయి. ధరలు పెరగడంతో అమ్మకాలు పడిపోయినా జ్యువెలర్ల రెవెన్యూ పెద్దగా తగ్గడం లేదని ఇక్రా వెల్లడించింది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం రూ. 63,230 పలికింది.
గోల్డ్కు జియో పొలిటికల్ టెన్షన్ల సపోర్ట్
ఇజ్రాయిల్– హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతుండడం, గ్లోబల్ ఎకానమీ మందగించడంతో గోల్డ్ రేట్లు సమీప కాలంలో పెరుగుతాయని ఇక్రా రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయని, ఇన్ఫ్లేషన్ గరిష్టాల్లోనే కొనసాగితే బంగారానికి డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. ‘ తనిష్క్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి ఆర్గనైజ్డ్ మార్కెట్లోని జ్యువెలర్ల రెవెన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–18 శాతం పెరుగుతుంది.
బిజినెస్ను విస్తరిస్తుండడం, కన్జూమర్లకు నచ్చేటట్టు నగలను అందుబాటులోకి తెస్తుండడంతో రెవెన్యూ నిలకడగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఆర్గనైజ్డ్ సెక్టార్లోని జ్యువెలరీ రిటైలర్లు మొత్తం ఇండస్ట్రీతో పోలిస్తే మీడియం టెర్మ్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తారు’ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుజయ్ షా అన్నారు. కొత్త స్టోర్లను ఓపెన్ చేస్తుండడంతో పాటు యాడ్స్ కోసం భారీగా ఖర్చు చేస్తుండడంతో వీరి మార్జిన్స్ (లాభాలు) తగ్గొచ్చని పేర్కొన్నారు.
అయినప్పటికీ మనలాంటి పెద్ద ఎకానమీలో ఆపరేటింగ్ మార్జిన్స్ నిలకడగా ఉంటాయని అంచనావేశారు. మీడియం టెర్మ్లో జ్యువెలర్ల లాభాలు ఏడాదికి 7.5 – 8 శాతం మేర పెరగొచ్చన్నారు. కొత్త స్టోర్ల ఏర్పాటు కోసం జ్యువెలర్లు అప్పులు చేస్తున్నా, మొత్తంగా ఇవి కంఫర్టబుల్ స్టేజ్లో ఉన్నాయని అన్నారు. ‘2020 – 21, 2021–22 లో తమ బిజినెస్లను విస్తరించాలని ఆర్గనైజ్డ్ జ్యువెలర్లు ప్లాన్ చేశారు. కానీ, ఈ ప్లాన్స్కు బ్రేక్లు పడ్డాయి. 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో బిజినెస్ విస్తరణపై దృష్టి పెట్టారు. కంపెనీల స్టోర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) పెరుగుతాయని అంచనా. మీడియం టెర్మ్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. కంపెనీల రెవెన్యూ పెరుగుతుంది’ అని షా వివరించారు.