- కాంగ్రెస్లో టికెట్ల పైరవీలు!
- హైకమాండ్కు సీనియర్ లీడర్ల సిఫార్సులు
- 20 మందితో కూడిన లిస్టులు పంపిస్తున్న నేతలు
- ఉత్తమ్ దగ్గరికి క్యూ కడ్తున్న ఆశావహులు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరడంతో ఆశావహుల్లో టెన్షన్ నెల కొంది. టికెట్ వస్తుందా? రాదా? అన్న ఆందోళన మొదలైంది. ఇప్పటికే చాలా మంది నేతలు గాంధీభవన్లోనే బల ప్రదర్శన చేశారు. మరికొందరు పైరవీలూ మొదలుపెట్టేశారు. టికెట్ ఇప్పించాలంటూ స్టేట్ లీడర్లతో మొరపెట్టుకుంటున్నారు. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతోందని, టికెట్ల నిర్ణయం హైకమాండ్చేతుల్లోనే ఉందని వాళ్లకు సర్దిచెబుతున్నారు. ఇప్పటికే 30 సెగ్మెంట్లలో అభ్యర్థులను ఖరారు చేశారన్న చర్చ జరుగుతున్నది.
పెద్ద లీడర్లు పోటీ చేసే స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ చేశారని చెబుతున్నారు. ఆ జాబితాను ఢిల్లీకి పంపించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, కొందరు సీనియర్ లీడర్లు హైకమాండ్ వద్ద సొంతంగా పైరవీలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ చేతుల్లో ఏమీ లేద ని చెప్తూనే.. హైకమాండ్కు లిస్ట్ పంపిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. తమకు కావాల్సిన వాళ్లు, దగ్గరగా ఉన్నోళ్లు, అనుచరులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారని అంటున్నారు. ఒక్కో సీనియర్ నేత.. కనీసం 20 మంది అభ్యర్థుల పేర్లను హైకమాండ్కు సిఫార్సు చేస్తున్నట్టు తెలిసింది.
పేర్లున్నయో లేవోనని నేతల్లో టెన్షన్..
పార్టీ పెద్దలు హైకమాండ్కు సిఫార్సు చేసిన పేర్లలో తమవి ఉన్నాయో లేవోనని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టుకు నేందుకు సిద్ధమని కొందరు సిఫార్సు లేఖలతో వెళ్తుం టే.. క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీకి విధేయతతో మరికొందరు నేతలు సిఫార్సులు చేస్తున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమి టీలో చోటు దక్కించుకున్న ఉత్తమ్ వద్దకు రోజూ అభ్యర్థులు క్యూ కడ్తున్నారు.
అభ్యర్థుల ఎంపికకు అత్యంత కీలకమైన ఆ కమిటీలో ఉత్తమ్ ఉండడంతో.. ఆయనకు నేరుగా మొర పెట్టుకుంటే పని అవుతుందన్న భావనలో ఆశావహులు ఉన్నారు. కాగా, మూడు దశలుగా అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ పని చేసింది. ఈ నెల 4 నుంచి 6వ తేదీ దాకా స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని నిర్వహించింది.
తొలి రోజు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సభ్యులతో విడివిడిగా మాట్లాడిన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్.. రెండో రోజు డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను తీసుకున్నారు. మూడో రోజు స్క్రీనింగ్ కమిటీ నేరుగా సమావేశమైంది. సీడబ్ల్యూసీ సమావేశాలున్న నేపథ్యంలో దానిపై ఫోకస్ పెట్టేలా కమిటీ మరోసారి మీటింగ్ పెట్టనుంది.