మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్నందున లక్షల కొద్దీ వేడుకలు జరుగుతాయి. వీటితో 51 బిలియన్ల డాలర్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ బంగారం, దుస్తులు, సేవల కోసం జనం మరింత ఖర్చు చేస్తారని, అనుబంధ పరిశ్రమలలో భారీ వృద్ధి ఉండొచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం వంటి అంతర్జాతీయ సమస్యలు ఉన్నప్పటికీ, పండుగ సీజన్ అమ్మకాలు తగ్గే చాన్సే లేదని అంటున్నారు.
న్యూఢిల్లీ: డెంటిస్ట్గా పనిచేస్తున్న శ్రేయ ఇప్పుడు బిజీబిజీ. ఎందుకంటే ఆమె మరో నాలుగు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే షాపుల చుట్టూ తిరుగుతున్నారు. యాక్సెసరీలు మొదలుకొని తాజా దుస్తుల వరకు ప్రతి దానిని కొనేస్తున్నారు. వందలాది మంది అతిథులకు బహుమతులను తీసుకుంటున్నారు. ఆమె కుటుంబం ఆగస్టులో పెళ్లి తేదీని ఖరారు చేసినప్పటి నుంచి ప్రతి వారాంతంలో షాపింగ్ చేస్తున్నారు.
తూర్పు రాష్ట్రం ఝార్ఖండ్లో శ్రేయ వివాహ వేడుక నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మధ్య వరకు జరుగుతుంది. ఇదే కాలంలో మనదేశంలో 35 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా. ఈ మ్యారేజ్ సీజన్లో వ్యాపారాలకు, సేవల సంస్థలకు 51 బిలియన్ల డాలర్ల విలువైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని స్టడీలు చెబుతున్నాయి. ఎందుకంటే వినియోగదారులు భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, దుస్తులు, ఇంటి సామాన్లను కొంటుంటారు. ఈ విషయమై రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రాజగోపాలన్ మాట్లాడుతూ ఈ నెల చివరి నుంచి జనవరి వరకు నగలు, దుస్తులు, ఫుట్వేర్, డిజైనర్ వేర్ వంటి కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని, వివాహ ఖర్చులకు సంబంధించిన పరిశ్రమలు భారీగా లాభపడతాయని చెప్పారు.
చాలా పెళ్లిళ్లు దీపావళి నుంచి కొత్త సంవత్సరం మొదటి కొన్ని నెలలలోపు జరుగుతుంటాయి. సంప్రదాయ వివాహాలు చాలా రోజుల పాటు జరుగుతాయి. కొన్ని రాష్ట్రాల్లో సంగీతం, రంగురంగుల దుస్తులతో అతిథులను అలరించడం, విందులు, పార్టీలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇన్ఫ్లేషన్ చాలా తక్కువగా ఉంది. సీజన్ మొదటి వారాల్లో భారీ అమ్మకాలు జరుగుతాయని అంటున్నారు.
విపరీతంగా బంగారం కొనుగోళ్లు
ఈ ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే మొత్తం అమ్మకాల విలువ దాదాపు 4.25 లక్షల రూపాయలు (51 బిలియన్ డాలర్లు) ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఈ కాలంలో బంగారాన్ని ధరించడం బహుమతిగా ఇవ్వడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. చాలా కుటుంబాలు తమ వివాహ బడ్జెట్లో ఎక్కువ భాగాన్ని నగలపై వెచ్చిస్తాయి. ఈసారి డిమాండ్ దాదాపు 800 టన్నులు ఉండొచ్చని, ఇందులో సగానికి పైగా వివాహాల కోసం కొనుగోలు చేస్తారని వ్యాపారులు చెబుతున్నారు. అత్యధికంగా బంగారాన్ని వాడే దేశాల్లో మనదేశానికి రెండోస్థానం.
టైటాన్, తనిష్క్, సెంకో గోల్డ్ లిమిటెడ్, త్రిభువన్దాస్ భీమ్జీ ఝావేరి లిమిటెడ్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా లిమిటెడ్ వంటి రిటైలర్లు పెళ్లిళ్ల సీజన్ కారణంగా భారీగా సంపాదిస్తాయని అంచనా. అక్టోబర్–-డిసెంబర్ మధ్య కాలంలో అమ్మకాలు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటాయని, ఇజ్రాయెల్–-హమాస్ యుద్ధం కారణంగా ధరలు పెరిగినా ఆభరణాల డిమాండ్పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ చిరాగ్ సేఠ్ అన్నారు. నగల కోసం భారతీయులు నెలల తరబడి డబ్బు ఆదా చేస్తారని, ధరలు పెరిగితే 2శాతం లేదా 3శాతం తక్కువగా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.
పెళ్లిళ్ల బడ్జెట్లు 10శాతం-–20శాతం పెరిగాయని ఢిల్లీకి చెందిన లే మాగ్నిఫిక్ ఫౌండర్, వెడ్డింగ్ ప్లానర్ నీరజ్ కుమార్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం పెరగడం వల్ల కుటుంబాలు ప్రొఫెషనల్ ప్లానర్ల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. చాలా మంది కుటుంబాలు పెళ్లిళ్ల కోసం రాజస్థాన్ కోటలు లేదా కేరళ, గోవా బీచ్ల వంటి చోట్లకు వెళ్తున్నాయి. హోటళ్లకు, విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. మనదేశంలో వెడ్డింగ్ మార్కెట్విలువ 210 బిలియన్ డాలర్లకు చేరింది.