భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనకుండానే ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించిన సంగతి తెలిసిందే. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వీరిద్దరూ నేరుగా వెళ్లనున్నట్లు భారత ఒలింపిక్ సంఘం అడ్హక్ కమిటీ తెలిపింది. అయితే ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ అండర్ 20 ప్రపంచ ఛాంపియన్ ఆంటిమ్ పంఘల్, అండర్ 23 ఆసియా ఛాంపియన్ సుజీత్ కల్కల్ ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏడాది పాటు ఏ అంతర్జాతీయ ఈవెంట్లోనూ పాల్గొనని రెజ్లర్లకు సెలక్షన్ ట్రయల్స్ నుండి మినహాయింపు ఇవ్వడం అన్యాయమని వారు రిట్ పిటిషన్ లో పొందపరిచారు. దీనిపై న్యాయపరమైన విచారణ కావాలని, ఆసియా క్రీడలకు ఎంపిక ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలని వారు కోర్టును కోరారు. అయితే ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అందుకు నిరాకరించటం గమనార్హం. ఈ విషయంపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ బెంచ్ తీర్పిచ్చినట్లు పీటీఐ వెల్లడించింది.
మరోవైపు రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఇటీవల నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించనందుకు గానూ ఆమెకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. దీనిపై స్పందించేందుకు నాడా.. ఆమెకు రెండు వారాల గడువిచ్చింది.