హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మినహాయింపేమీ కాదు. ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడికెళ్లినా ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సేనని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని నియోజకవర్గాల్లో ఆశావహులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉన్నారు. ఎవరికి వారు తమకే టికెట్ వస్తుందని ఆశిస్తున్నారు. కొందరు నేతలు బహిరంగంగా ప్రకటనలూ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ ఎవరికివ్వాలనే దానిపై ఇప్పటికే రేవంత్ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. టికెట్ ఆశిస్తున్న వారిపై అన్ని నియోజకవర్గాల్లో ఆయన సొంతంగా సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సునీల్ కనుగోలు టీం.. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నా, అభ్యర్థులపై రేవంత్ పర్సనల్గా సర్వే చేయిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
బలమైన అభ్యర్థుల గురించి ఆయన సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులను నియమించి అభ్యర్థుల స్థితిగతులపై ఆరా తీయిస్తున్నారని సమాచారం. రేవంత్ నియమించిన వ్యక్తులు.. టికెట్ ఆశిస్తున్న వాళ్ల దగ్గరకు వెళ్లి మీకు టికెట్ ఎందుకివ్వాలి? గతంలో పోటీచేసిన సందర్భాలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? లేదా? వంటి విషయాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. టికెట్ ఇస్తే ఎన్నికల ఖర్చు పెట్టుకోగలరా? రెబల్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? వంటి వివరాలు కూడా ఆరాతీస్తున్నారని తెలుస్తోంది.
డీకే శివకుమార్ స్ఫూర్తితోనే
కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్ఫూర్తితోనే రేవంత్ కూడా సర్వేలు చేయిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. డీకే డిజైన్బాక్స్ అనే సొంత సంస్థ ద్వారా రాష్ట్రంలో పార్టీ తీరుపై సర్వే చేయించుకుంటున్నారు. అలాగే రేవంత్ కూడా తన సొంతంగా సర్వేలు చేయించుకుంటూ అభ్యర్థుల గెలుపోటములు, కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని అంచనా వేసుకుంటున్నారు. మరోవైపు వచ్చే నెలలో కాంగ్రెస్ తరఫున కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రేవంత్ అక్కడకు వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడి సరిహద్దు జిల్లాల్లో రేవంత్ ప్రచారం చేస్తే.. అక్కడున్న తెలుగు వారి ఓట్లు కాంగ్రెస్కు పడతాయన్న ఆలోచనలో ఆ రాష్ట్ర నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజాభిప్రాయ సేకరణ కూడా..
నేతలను నేరుగా సర్వే చేయడంతో పాటు వారికి ప్రజల్లో ఉన్న ఆదరణ గురించి కూడా రేవంత్ తన సర్వేల ద్వారా తెలుసుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెప్పించుకుంటున్నారని హైదరాబాద్లోని ఓ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించినా.. మళ్లీ పార్టీ మారతారన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇకపై అలా జరగకుండా ఉండేందుకు రేవంత్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే పార్టీ మారిన నేతలపై కోర్టులో కేసు కూడా వేశారు. పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరిన వారిపై లీగల్ ఫైట్ చేస్తున్నారు.