- ఢాకాలో ఘోర రైలు ప్రమాదం
- 16 మంది మృతి.. 60 మందికి గాయాలు
ఢాకా: సెంట్రల్ బంగ్లాదేశ్లోని బ్రహ్మంబారియ జిల్లాలో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ కొనడంతో కొన్ని బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. అందులో చిక్కుకుని 16 మంది చనిపోగా.. మరో 60 మంది గాయపడ్డారు. కొందరి కండీషన్ సీరియస్గా ఉండడంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెప్పారు. రైలు డ్రైవర్లు సిగ్నల్స్ను పట్టించుకోకుండా ముందుకెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. ఈ యాక్సిడెంట్ నేపథ్యంలో ఢాకా–ఛట్టోగ్రామ్, ఢాకా–నోఖాలి, ఛట్టోగ్రామ్–సిల్హెట్ మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలను రైల్వే అధికార ప్రతినిధి వెల్లడించారు.. మండోభాగ్ స్టేషన్లో ఉదయన్ ఎక్స్ ప్రెస్ ట్రాక్ మారుతుండగా.. ఢాకా నుంచి వస్తున్న టర్నా నిషిత ఎక్స్ ప్రెస్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో టర్నా నిషిత రైలుతో పాటు ఉదయన్ ఎక్స్ప్రెస్ ఇంజన్, నాలుగు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమించాయి. శిథిలాల్లో చిక్కుకున్న 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలైన మరో నలుగురు హాస్పిటల్కు తరలిస్తుండగా చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో గాయపడ్డ 60 మందిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి, ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్లు అధికారులు వివరించారు. బంగ్లాదేశ్ రైల్వే మినిస్టర్ నూరుల్ ఇస్లాం సుజన్, రైల్వే సీనియర్ అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిగ్నల్స్ గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అన్నారు.
డ్రైవర్లు, కండక్టర్ల సస్పెన్షన్
ఈ ప్రమాదానికి కారణమైన టర్నా నిషితా ట్రైన్ డ్రైవర్లు, కండక్టర్లను ఇమ్మీడియెట్గా సస్పెండ్ చేసినట్లు రైల్వే ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి వేర్వేరుగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించారు. ఇక, బ్రహ్మంబారియ జిల్లా యంత్రాంగం సెపరేట్గా ఓ విచారణ కమిటీని నియమించింది.
ప్రెసిడెంట్ హమీద్, ప్రధాని షేక్ హసీనా సంతాపం
బంగ్లా ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనా, పార్లమెంటరీ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. లోకోమోటివ్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వాలని రైల్వే ఉన్నతాధికారులకు ప్రధాని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.