
- పంజాబ్ లో ఘటన..హోటల్ సిబ్బంది అరెస్ట్
చండీగఢ్: భోజనానికి క్యాష్ పేమెంట్ కాకుండా ఆన్లైన్లో పే చేశారని ఆర్మీ మేజర్తో పాటు మరో 16 మంది జవాన్లపై హోటల్ సిబ్బంది దాడి చేశారు. ఈ ఘటనలో దాబా ఓనర్తోసహా నలుగురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్ కు చెందిన ఆర్మీ మేజర్ సచిన్ సింగ్ కుంతల్ తన టీమ్తో కలిసి లాహౌల్లో జరిగిన స్నో మారథాన్లో పాల్గొని మనాలికి తిరిగి వస్తున్నారు.
వారంతా పంజాబ్లోని మనాలి–రోపర్ రోడ్డు పక్కన ఉన్న ఆల్ఫైన్ దాబాలో ఆగి భోజనం చేశారు. యూపీఐ ద్వారా బిల్లు పే చేస్తామని జవాన్లు, క్యాష్ ఇవ్వాలని ఓనర్ పట్టుబట్టాడు. ఫైనల్గా యూపీఐ ద్వారానే పేమెంట్ చేయడంతో గొడవకు దారి తీసింది. దాబాకు చెందిన 35 మంది సిబ్బంది జవాన్లపై దాడి చేశారు. గొడవలో జవాన్లకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దాబా ఓనర్, నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.