ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముథూట్పై మంగళవారం ఉదయం దాడి జరిగింది. జార్జ్ మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన ఆఫీస్కు వెళ్తుండగా.. స్థానిక ఐజీ కార్యాలయం ముందు ఆయన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన స్వల్ప గాయాలపాలయ్యారు. వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు.
గత నెలలో కేరళలోని 43 ముత్తూట్ శాఖల నుంచి 160 మంది సిబ్బందిని తొలగించారు. దాంతో కంపెనీకి వ్యతిరేకంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ఆధ్వర్యంలో కొంతమంది ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.
కంపెనీ ఎండీపై జరిగిన దాడి వెనుక సీఐటీయూ గూండాలు ఉన్నారని కంపెనీ యాజమాన్యం ఆరోపిస్తుంది. అయితే, ఈ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని సీఐటీయూ నాయకులు అంటున్నారు. ఇలాంటి హింసాత్మక ఆందోళనలు మేం చేయమని సీఐటీయూ నాయకుడు అనంతలవట్టం ఆనందన్ అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఆఫ్ కేరళ ఈ సంఘటనను ఖండిస్తూ.. ఈ దాడి చాలా ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.
ముత్తూట్ ఫైనాన్స్ బంగారు నగలను తాకట్టు పెట్టుకొని వడ్డీకి డబ్బులు ఇస్తుంది. ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 4,500 బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్లో దేశవ్యాప్తంగా దాదాపు 30,000 వేల మందికి పైగా ఉద్యోగలు పనిచేస్తున్నారు.
For More News..