ఇన్వెస్టర్ల ముందు మరిన్ని ఐపీవోలు
ఓపెన్ అయిన కాంకర్డ్ బయోటెక్, ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్, యుడిజ్ సొల్యూషన్స్, సంగాని హాస్పిటల్స్
ఈ నెల 8 చివరి తేది.. ఆకర్షిస్తున్న ఐపీఓ మార్కెట్.. ఇన్వెస్టర్లకు మంచి లాభాలు
న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్ హాట్హాట్గా మారింది. న్యూవెబ్ టెక్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సెంకో గోల్డ్ వంటి కంపెనీలు లిస్టింగ్ రోజు అదరగొట్టాయి. ఇన్వెస్టర్లకు భారీ లాభాలిచ్చాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీల ఐపీఓలు ఓపెన్లో ఉన్నాయి. ఈ నెల 8 (మంగళవారంతో ) వీటి పబ్లిక్ ఇష్యూస్ ముగియనున్నాయి. ఈ కంపెనీల ఐపీఓల గురించి తెలుసుకుందాం.
1. కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్..
కాంకర్డ్ బయోటెక్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 4 న ఓపెన్ అయ్యింది. 8 వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద 2.09 కోట్ల ఈక్విటీ షేర్లను కాంకర్డ్ బయోటెక్ షేర్ హోల్డర్లు అమ్ముతున్నారు. మొదటి రోజు ఈ పబ్లిక్ ఇష్యూ 58 శాతం సబ్స్క్రిప్షన్ సాధించింది. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్ఐఐ) కోసం కేటాయించిన షేర్లు పూర్తిగా సబ్స్క్రయిబ్ అయ్యాయి.
రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 72 శాతం, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్ (క్యూఐబీ) పోర్షన్ ఒక శాతం సబ్స్క్రిప్షన్ సాధించాయి. షేరును రూ.705–741 ప్రైస్ బ్యాండ్లో అమ్ముతున్నారు. కనీసం 20 షేర్ల కోసం బిడ్స్ వేయాల్సి ఉంటుంది. కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో ఇష్యూ ధర కంటే రూ.150 ఎక్కువ పలుకుతున్నాయి. కాగా, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.1,551 కోట్లను షేర్ హోల్డర్లు సేకరించనున్నారు.
అంతేకాకుండా ఐపీఓ స్టార్ట్ కాకముందు రూ.465 కోట్లను యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ సేకరించింది. సింగపూర్ గవర్నమెంట్, అబు ధాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ లైఫ్ వంటి పెద్ద కంపెనీలు యాంకర్ రౌండ్లో పార్టిసిపేట్ చేశాయి. ఆంకాలజీ, ఇమ్యూనోసప్రెసెంట్స్కు చెందిన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ను కాంకర్డ్ తయారు చేస్తోంది. ఈ కంపెనీలో క్వాడ్రియా క్యాపిటల్ ఫండ్, రాకేష్ జున్జున్వాలాకు చెందిన రేరా ఎంటర్ప్రైజెస్కు వాటాలు ఉన్నాయి.
2. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్..
ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ ఐపీఓ ఈ నెల 3 న ఓపెన్ అయ్యింది. ఏడో తేది వరకు అందుబాటులో ఉంటుంది. పబ్లిక్ ఇష్యూలో షేరును రూ.54–57 దగ్గర అమ్ముతున్నారు. లాట్ సైజ్ 260 షేర్లు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,025 కోట్లను ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ సేకరించాలని చూస్తోంది. సుమారు 13.35 కోట్ల షేర్లను ఐపీఓ ద్వారా కంపెనీ అమ్ముతుండగా, మొదటి రెండు రోజుల్లో 7 రెట్లు ఎక్కువ సబ్స్క్రిప్షన్ సాధించింది. రిటైల్ పోర్షన్ షేర్లు 4.93 రెట్లు, ఎన్ఐఐ కేటగిరీ 12.95 రెట్లు, క్యూఐబీ పోర్షన్ 6.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యాయి. ఎస్బీఎఫ్సీ ఫైనాన్స్ షేర్లు గ్రేమార్కెట్లో ఇష్యూ ధర కంటే రూ.40 ఎక్కువ పలుకుతున్నాయి.
3. యుడిజ్ సొల్యూషన్స్..
ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓకి వచ్చిన యుడిజ్ సొల్యూషన్స్ ఈ నెల 8 వరకు సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్లో ఉంటుంది. షేరు ధర రూ.162–165 గా నిర్ణయించారు. మొత్తం 19,57,600 షేర్లను ఐపీఓ ద్వారా యుడిజ్ అమ్ముతోంది. ఇందులో 15,92,000 షేర్లకు మొదటి రోజు అయిన ఈ నెల 4 న బిడ్స్ వచ్చాయి. లాట్ సైజ్ 800 షేర్లు. కంపెనీ షేర్లు గ్రేమార్కెట్లో ఇష్యూ ధర కంటే రూ.40 ఎక్కువ పలుకుతున్నాయి. గేమ్స్ సెగ్మెంట్లో ఈ కంపెనీ బిజినెస్ చేస్తోంది. ఐపీఓ ద్వారా రూ.44.84 కోట్లను సేకరించాలని చూస్తోంది.
4. సంగాని హాస్పిటల్స్..
సంగాని హాస్పిటల్స్ కూడా ఈ నెల 4 న ఓపెన్ అయ్యింది. ఎనిమిదో తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కంపెనీ కూడా ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీఓకి రాగా, పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 15.17 కోట్లను సేకరించాలని చూస్తోంది. సుమారు 38 లక్షల షేర్లను అమ్ముతుండగా, 29 లక్షల షేర్లకు మొదటి రోజే బిడ్స్ వచ్చాయి. ఐపీఓలో షేరును రూ. 37–40 కి అమ్ముతున్నారు. లాట్ సైజ్ 3 వేల షేర్లు. గ్రేమార్కెట్లో ఒక రూపాయి ఎక్కువకు ట్రేడవుతోంది.
టీవీఎస్ సప్లయ్ చెయిన్..
టీవీఎస్ మొబిలిటీ గ్రూప్కు చెందిన టీవీఎస్ సప్లయ్ చెయిన్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల 10 ఇన్వెస్టర్ల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14 న ముగుస్తుంది. ఆగస్టు9 న యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఫండ్స్ సేకరించనున్నారు.
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఫ్రెష్ షేర్లను ఇష్యూ చేసి రూ.600 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. దీనికి అదనంగా 1.42 కోట్ల షేర్లను షేరుహోల్డర్లు అమ్మనున్నారు. ప్రైస్ బ్యాండ్ను త్వరలో ప్రకటించనున్నారు.