
ఆస్ట్రేలియాదే ఆరంభం
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 255/4
రాణించిన కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్
షమీకి 2 వికెట్లు
ఆసీస్తో నాలుగో టెస్ట్
ఇండియాతో గురువారం మొదలైన నాలుగో టెస్ట్లో ఆస్ట్రేలియాకు అద్భుతమైన ఆరంభం లభించింది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై ఓపెనర్ ఉస్మాన్ ఖవాజ (251 బాల్స్లో 15 ఫోర్లతో 104 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 255/4 స్కోరు చేసింది. ఖవాజతో పాటు కామెరూన్ గ్రీన్ (49 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (38) అండగా నిలిచాడు. సిరీస్తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ బెర్త్పై కన్నేసిన టీమిండియా బౌలర్లు తొలి రోజు తేలిపోయారు. షమీ 2 వికెట్లు తీశాడు.
బౌలర్లు ఫెయిల్..
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. ఫ్లాట్ పిచ్పై నిలకడగా ఆడింది. ఆరంభంలో వికెట్పై ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న షమీ, అశ్విన్ లంచ్ వరకు రెండు వికెట్లు పడగొట్టి పైచేయి సాధించినా.. చివరి రెండు సెషన్లలో ఇండియా కేవలం రెండు వికెట్లతోనే సరిపెట్టుకుంది. స్టార్టింగ్ నుంచే హెడ్ (32).. ఇండియా బౌలింగ్పై ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 7 రన్స్ వద్ద ఉమేశ్ బౌలింగ్లో ఇచ్చిన ఈజీ క్యాచ్ను కీపర్ భరత్ డ్రాప్ చేశాడు. దీనికి తోడు బౌన్స్లో అనూహ్యమైన మార్పుల వల్ల బాల్ను అందుకోవడంలో తెలుగు వికెట్ కీపర్ చాలా ఇబ్బందిపడ్డాడు. దీనిని ఆసరాగా తీసుకున్న హెడ్... ఉమేశ్ బౌలింగ్లో ఆరు ఫోర్లతో రెచ్చిపోయాడు. రెండో ఎండ్లో ఖవాజ మాత్రం సింగిల్స్కే పరిమితంకాగా, అశ్విన్ (1/57) రాకతో హెడ్ కూడా కాస్త నెమ్మదించాడు. చివరకు 16వ ఓవర్లో లెంగ్త్ మార్చి ప్రయోగించిన ఫుల్ టాస్ బాల్ను హెడ్ సరిగా డిఫెన్స్ చేయలేక మిడాన్లో జడ్డూకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్కు 61 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఐదు ఓవర్ల తర్వాత లబుషేన్ (3)ను షమీ బోల్తా కొట్టించడంతో ఆసీస్ 75/2తో లంచ్కు వెళ్లింది. రెండో సెషన్లో పిచ్ స్లోగా మారడంతో ఇండియా బౌలర్లు వికెట్లు తీయడానికి చాలా ఇబ్బందిపడ్డారు. కొద్దిసేపు పేస్–స్పిన్ను ప్రయోగించిన రోహిత్.. తర్వాత రెండు ఎండ్ల నుంచి ఇద్దరు స్పిన్నర్లను దించినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కువసేపు క్రీజులో నిలబడిన ఖవాజ సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. రెండో ఎండ్లో స్మిత్ కూడా ఆచితూచి ఆడటంతో ఈ సెషన్లో వికెట్ దక్కలేదు. వీరిద్దరు ఈ సెషన్లో 74 రన్స్ జత చేసి 149/2తో టీ బ్రేక్కు వెళ్లారు. విరామం నుంచి వచ్చిన వెంటనే జడ్డూ వికెట్ అందించి జోష్ తెచ్చాడు. ఫోర్త్ స్టంప్ లైన్ నుంచి జడేజా (1/49) వేసిన గుడ్ లెంగ్త్ బాల్ను స్మిత్ బ్యాట్తో అడ్డుకునే ప్రయత్నం చేసినా అనూహ్యంగా టర్న్ అయి లెగ్ స్టంప్ను తాకింది. దీంతో మూడో వికెట్కు 79 రన్స్ పార్ట్నర్షిప్ ముగిసింది. కొద్దిసేపటికే హ్యాండ్స్కోంబ్ (17)ను షమీ వెనక్కి పంపడంతో ఆసీస్ 170/4తో నిలిచింది. ఈ దశలో గ్రీన్, ఖవాజ.. దాదాపు 20 ఓవర్ల పాటు వికెట్ను కాపాడుకుంటూ ఐదో వికెట్కు అజేయంగా 85 రన్స్ జతచేయడంతో ఆసీస్ మంచి స్థితిలో కొనసాగుతున్నది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 255/4 (ఖవాజ 104*, గ్రీన్ 49*, షమీ 2/65, అశ్విన్1/57).
మ్యాచ్ను తిలకించిన ప్రధానులు
ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా హాజరైన ఇండో–ఆసీస్ ప్రధానులు నరేంద్ర మోడీ, ఆంథోనీ అల్బనీస్.. ప్రెసిడెంట్ బాక్స్ నుంచి దాదాపు అరగంట పాటు మ్యాచ్ను తిలకించారు. గోల్ఫ్ కార్లో స్పోర్ట్స్ ఎరీనాను చుట్టి వచ్చిన ప్రైమ్ మినిస్టర్స్.. తమ టీమ్ కెప్టెన్స్కు టెస్ట్ క్యాప్లను అందజేశారు. స్టేడియంలో తమ ఆటగాళ్ల వైపు నిలబడిన మోడీ, అల్బనీస్.. జాతీయ గీతాలాపన కూడా చేశారు. ఇండియన్ ప్లేయర్లను రోహిత్ పరిచయం చేయగా, మోడీ షేక్హ్యాండ్ ఇస్తూ ముందుకు కదిలారు. ఈ సిరీస్లో అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేస్తున్న స్పిన్నర్ నేథన్ లైయన్తో అల్బనీస్ కాసేపు ఎక్కువగా ముచ్చటించారు. స్టేడియంలోని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ మ్యూజియాన్ని సందర్శించిన ప్రధానులకు అక్కడి విశేషాలను రవిశాస్త్రి వివరించాడు. బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా.. అల్బనీస్, మోడీకి వాళ్ల ఫొటోలతో కూడిన మెమొంటోలను బహుకరించారు. కీలక మ్యాచ్ కావడం, ప్రధానులు రావడంతో తొలి రోజు మ్యాచ్ చూడటానికి లక్ష మంది హాజరయ్యారు. దీంతో గతంలో మెల్బోర్న్ (91,092 మంది) పేరుమీదున్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. 2013 యాషెస్ సందర్భంగా ఎంసీజీలో ఈ రికార్డు నమోదైంది.