టీ20 వరల్డ్ కప్ విజేత ఇంగ్లాండ్కు ఆస్ట్రేలియా షాకిచ్చింది. మూడు మ్యాచుల వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి 2–0తో సిరీస్ ను దక్కించుకున్న ఆసీస్..చివరిదైన మూడో మ్యాచులోనూ ఇంగ్లాండ్ పై 221 పరుగుల భారీ తేడాతో గెలిచి 3–0తో సిరీస్ను కైవసం చేసుకుంది. 364 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగన ఇంగ్లాండ్..ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 142 పరుగులకే కుప్పకూలింది.
హెడ్, వార్నర్ సెంచరీల మోత..
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 355 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్లు చెలరేగి ఆడారు. ఇద్దరు శతకాల మోత మోగించారు. ట్రావిస్ హెడ్ 152 పరుగులు, వార్నర్ 106 రన్స్ చేశారు. అంతేకాకుండా తొలి వికెట్ కు ఏకంగా 269 పరుగులు జోడించి ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ 21 పరుగులు, మిచెల్ మార్ష్ 30 పరుగులతో రాణించారు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ మధ్యలో వాన రావడంతో..ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను 48 ఓవర్లకు కుదించారు. కానీ డకవర్త్ లూయిస్ ప్రకారం ఇంగ్లాండ్ టార్గె్ట్ ను 364 రన్స్ గా అంపైర్లు నిర్ణయించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓల్లీ స్టోన్ 4 వికెట్లు తీశాడు. లియామ్ డాసన్ ఒక వికెట్ పడగొట్టాడు.
దారుణంగా విఫలమయ్యారు..
ఆ తర్వాత 364 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్...ఆసీస్ బౌలర్ల ధాటికి కేవలం 31.4 ఓవర్లలో 142 పరుగులకే అలౌట్ అయ్యింది. ఓపెనర్ జేసన్ రాయ్ (33), జెమ్స్ (22) పరుగులు చేశారు. మలాన్ (2) సామ్ బిల్లింగ్స్ (7), మొయిన్ ఆలీ (18), బట్లర్ (1), వోక్స్ (0), సామ్ కరన్ (12), లిమ్ (18), విల్లే (12), ఆలీ స్టోన్ (4) ఘోరంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలింగ్లో ఆడమ్ జంపా 4 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్, సీన్ అబాట్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నాడు. హెజల్ఉడ్ , మిచల్ మార్స్ తలో వికెట్ తీశారు. సూపర్ సెంచరీతో భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన ట్రావిస్ హెడ్ మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లో అద్భుతంగా ఆడిన వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ది టోర్నీ అవార్డు లభించింది.