పరువు పోగొట్టుకున్నారు: హండ్రెడ్ లీగ్‌లో పాక్ స్టార్ ఆటగాళ్లకు ఘోర అవమానం

పరువు పోగొట్టుకున్నారు: హండ్రెడ్ లీగ్‌లో పాక్ స్టార్ ఆటగాళ్లకు ఘోర అవమానం

సొంతగడ్డపై అదరగొట్టి ఇతర వేదికలపై విఫలమవడం పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లకు అలవాటే. ముఖ్యంగా పాక్ స్టార్ ప్లేయర్స్ బాబర్ అజామ్,  మహ్మద్ రిజ్వాన్ ఈ లిస్టులో మొదటి వరుసలో నిలుస్తారు. ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో సత్తా చాటిన వీరిద్దరూ.. ది హండ్రెడ్ 2024 ప్లేయర్ డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోలేదు. అంతర్జాతీయ  టీ20 క్రికెట్ లో అద్భుతమైన రికార్డులు ఉన్న ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ లో అమ్ముడుపోకపోవడం వరుసగా ఇది నాలుగోసారి. 2021,2022,2023 సీజన్ లలో బాబర్, రిజ్వాన్ ను ఎవరూ పట్టించుకోలేదు. 

2024 సీజన్ కు బాబర్, రిజ్వాన్ మరోసారి అన్ సోల్డ్ కాగా.. నెటిజన్స్ వీరిద్దరిని ట్రోల్స్ చేస్తున్నారు. మీరు పాక్ క్రికెట్ లో తప్ప ఎక్కడ ఆడలేరు అని కొంతమంది అంటుంటే.. మిమ్మల్ని కొనకుండా ది హండ్రెడ్ లీగ్ సరైన నిర్ణయమే తీసుకుందని మరికొందరు అంటున్నారు. ది హండ్రెడ్ లీగ్ యొక్క నాల్గవ ఎడిషన్ జూలై 23న ప్రారంభం కానుంది. ఇటీవలే జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్ లో బాబర్ అజామ్ 569 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిస్తే.. రిజ్వాన్ 407 పరుగులు చేశాడు. 

ఈ ఇద్దరు పాక్ ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా వెలిగిన జాసన్ రాయ్, డేవిడ్ వార్నర్, టిమ్ డేవిడ్, షకీబ్ అల్ హసన్ ఎంపిక కాలేదు. పాకిస్థాన్ లో ముగ్గురు ప్లేయర్లు ఈ లీగ్ లో సెలక్ట్ అయ్యారు. ది హండ్రెడ్ లీగ్ లో మొత్తం ముగ్గురు పాక్ ఆటగాళ్లు ఎంపికయ్యారు. పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది (వెల్స్ ఫైర్), నసీమ్ షాను (బర్మింగ్‌హామ్ ఫీనిక్స్), రిటైర్డ్ ఆల్-రౌండర్ ఇమాద్ వాసిమ్ (ట్రెంట్ రాకెట్స్‌)  2024 జులైలో జరిగే ఈ లీగ్ లో ఆడనున్నారు. 

Also Read :ముంబై ఇడియన్స్ జట్టులో దక్షిణాఫ్రికా సంచలనం