జుట్టు పట్టి, చొక్కా చించి..

జుట్టు పట్టి, చొక్కా చించి..

జాదవ్​పూర్​ వర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియోపై దాడి
ఆరు గంటల పాటు టెన్షన్​.. ఆ తర్వాత వచ్చి మంత్రిని తీసుకెళ్లిన బెంగాల్​ గవర్నర్​ ధన్​కర్​

కోల్​కతా:బెంగాల్​లోని జాదవ్​పూర్ వర్సిటీ గురువారం రణరంగంలా మారింది. స్టూడెంట్​ యూనియన్ల మధ్య కొట్లాట కేంద్ర మంత్రి బాబుల్​ సుప్రియోపై దాడికి దారితీసింది. గంటల పాటు వర్సిటీ లోపల చిక్కుకుపోయిన మంత్రిని చివరికి గవర్నర్​ వచ్చి కాపాడారు. ఈ సంఘటనతో బెంగాల్​లో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది.

అసలేం జరిగిందంటే..

జేయూలో ఏబీవీపీ గురువారం మధ్యాహ్నం ఓ సెమినార్​ నిర్వహించింది. దీనికి సుప్రియో గెస్ట్​గా వచ్చారు. బీజేపీ ఎంపీ రాకను నిరసిస్తూ లెఫ్ట్​ పార్టీలకు చెందిన ఎస్​ఎఫ్​ఐ, ఐఐఎఫ్​ఎస్​, ఎఫ్​ఈటీఎస్​యూ, ఐఏఎస్​ఏ తదితర యూనియన్లు నిరసనలు చేపట్టాయి. నల్లజెండాలు ఊపుతూ మంత్రి కారును అడ్డుకునే ప్రయత్నం చేశాయి. బాబుల్​ వెనక్కి వెళ్లిపోవాలని లెఫ్ట్​ వింగ్​ స్టూడెంట్లు నినాదాలు చేశారు. వీటిని లెక్కచేయకుండా మంత్రి లోనికెళ్లి, సెమినార్​లో మాట్లాడిన తర్వాత తిరిగి వెళుతుండగా మరోసారి లెఫ్ట్​వింగ్​ స్టూడెంట్స్ ఆయన్ని అడ్డుకున్నారు. మంత్రిని చుట్టుముట్టిన స్టూడెంట్స్ ఒక దశలో ఆయనపై దాడికి దిగారు. సెక్యూరిటీ, పోలీసుల్ని కిందపడేసి, మంత్రి జుట్టు పట్టుకుని, చెంపలపై కొడుతూ, చొక్కా చించేశారు.  వీసీ సురంజన్​ దాస్​ సర్దిచెప్పినా స్టూడెంట్స్ వినిపించుకోలేదు. దాదాపు రెండు గంటలపాటు మంత్రిని నిర్బంధించారు.

కాపాడిన గవర్నర్​

మంత్రిని ఘెరావ్ చేశారన్న విషయం తెలియగానే ​బెంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ రంగంలోకిదిగారు. ఘటనను సీరియస్​గా తీసుకున్న ఆయన, పోలీస్​ ఫోర్స్​ను వెంటేసుకుని వర్సిటీకి బయలుదేరారు. గవర్నర్​ను కూడా లోనికి రానియ్యకుండా స్టూడెంట్స్ అడ్డుకున్నారు. పోలీసుల సాయంతో మంత్రిని కాపాడిన గవర్నర్​.. రాత్రి 8.30 గంటలకు తన కారులోనే ఆయనను బయటికి తీసుకొచ్చారు. బీజేపీ మంత్రిని లెఫ్ట్​వింగ్​ అడ్డుకోడాన్ని నిరసిస్తూ ఏబీవీపీకి చెందిన స్టూడెంట్లు వర్సిటీలో విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల రూమ్​లలో ఫ్యాన్లు, టేబుళ్లను ధ్వంసం చేసి, క్యాంపస్​లో పలుచోట్ల టైర్లను తగులబెట్టారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫొటోలు, వీడియోల ఆధారంగా మంత్రిపై దాడికి పాల్పడ్డవారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదంపై టీఎంసీ నేతలెవరూ స్పందించలేదు.

నక్సలైట్లమని చెప్పుకున్నారు

మమతా బెనర్జీ పాలనలో లా అండ్​ ఆర్డర్​ గాడితప్పింది. నాపై దాడి ఘటనే అందుకు నిదర్శనం. నాతో వాగ్వాదానికి దిగిన స్టూడెంట్స్ తమను తాము నక్సలైట్లుగా చెప్పుకున్నారు. పదేపదే రెచ్చగొట్టేలా మాట్లాడారు. సెమినార్​లో మాట్లాడటానికే జేయూకి వెళ్లాను తప్ప రాజకీయాలు చేయడానికి కాదు.

– మంత్రి బాబుల్​ సుప్రియో