సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్ 

సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్ 

కొత్తపల్లి, వెలుగు : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ వందసార్లకు పైగా మార్చి అవమానించిందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్​కుమార్ అన్నారు.  ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా?  అని ప్రశ్నించారు. కొత్తపల్లి మున్సిపల్​ ఏరియాలోని మార్కెట్​లో శనివారం రాత్రి నిర్వహించిన స్ట్రీట్​కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్​ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కొంటోందని ఆరోపించారు. కేసీఆర్ దేవుడి తీర్థ ప్రసాదాలు, అక్షింతలను హేళన చేస్తున్నారని మండిపడ్డారు. తాను కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు తీసుకొచ్చానని చెప్పారు. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుస్తుందని రిపోర్టులు రావడంతో సీఎం రేవంత్​రెడ్డి బెంబేలెత్తిపోయి పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని, మోదీ బతికున్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని ప్రకటించిన తర్వాత కూడా విషం చిమ్ముతున్నారని చెప్పారు. ఆయన వెంట ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్​ శంకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్ తదితరులు ఉన్నారు.