మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయం : బండి సంజయ్ 

మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయం : బండి సంజయ్ 

మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఫస్ట్ తేదీనే జీతాలు ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పారు. నెలరోజుల్లోనే పెండింగ్ డీఏలన్నీ చెల్లిస్తామన్నారు. ‘పీఆర్సీని నియమిస్తాం.. 317జీవోను సవరిస్తాం.. ఓటేసే ముందు టీచర్లు ఒక్క క్షణం ఆలోచించండి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సత్తా చూపండి.. మీ అందరి ఆశీర్వాదంతో మోడీ ఆధ్వర్యంలో రామరాజ్యం రాబోతోంది.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపాధ్యాయులకు సంబంధించినవి మాత్రమే కావు.. అసెంబ్లీ ఎన్నికల వరకు ఇతర ఎన్నికలు లేవు.. తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణలో పేదలు పడుతున్న బాధలను గుర్తు చేసుకుని ఓటేయండి.. గతంలో ముఖ్యమంత్రులు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చేవారని, సీఎం కేసీఆర్ మాత్రం ఏ మాట ఇచ్చినా అంతే సంగతులు.. పంజాబ్ కు చెక్కులు పంచితే చెల్లలేదు. పాకిస్తాన్, శ్రీలంక, చైనా గురించి గొప్పగా మాట్లాడితే.. ఆ దేశాలు అడుక్కునే తినే స్థాయికి వచ్చాయి. ఫస్ట్ నాడు జీతాలు ఇయ్యలేని దుస్థితి. జీతాలు ఇయ్యకపోయినా టీచర్లు ఏం చేయలేరనే భావనతో కేసీఆర్ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ల సత్తా ఏమిటో కేసీఆర్ కు రుచి చూపించాలి’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని AMR గార్డెన్స్ లో తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం (TPUS) ఆధ్యర్యంలో బీజేపీ టీచర్స్ MLC అభ్యర్థి  ఎవీఎన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉపాధ్యాయ, అధ్యాపక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోహన్ రెడ్డి హాజరయ్యారు. 

కేబినెట్ లో పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలపై ఎందుకు చర్చించలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అప్పులన్నీ తీరాలంటేనే బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ లేకుంటే ఉద్యోగులకు 3 నెలలకోసారి జీతాలిచ్చే పరిస్థితి ఉందన్నారు. ఒక్కో ఉపాధ్యాయ సంఘానికి రూ. 5 కోట్లు ఇచ్చి... ఓట్లను కొనేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నట్లు ప్రచారం చేస్తూ టీచర్ల గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పొరపాటున మూడోసారి బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ అహంకారం తలకెక్కడం ఖాయం అని వ్యాఖ్యానించారు. దళితబంధు, పేదలకు గృహ నిర్మాణాలకు డబ్బులు ఎక్కడి నుంచి కేసీఆర్ తీసుకొస్తారని ప్రశ్నించారు. కేబినెట్ భేటీలో టీచర్ల సమస్యల గురించి కనీసం ప్రస్తావించకపోవడం బాధాకరం అన్నారు. 

కవిత ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంట్ లో ఒక్కసారి కూడా మహిళా బిల్లు గురించి మాట్లాడలేదని బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు కాపీలను చించిపారేసిన సమాజ్ వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీలను వెంటేసుకుని మహిళా బిల్లు కోసం దీక్ష చేయడం సిగ్గు చేటు అని చెప్పారు. కవిత తలపెట్టిన దీక్షను చూసి జనం నవ్వుకుంటున్నారని మండిపడ్డారు.  తనపై రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ సిబ్బందితో నిఘా పెట్టిందని చెప్పారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇస్తే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు.. ఇతరులకు వస్తే ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.