రామచంద్రాపురం, వెలుగు: బండ్లగూడ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కో ఆపరేటీవ్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కమ్యూనిటీ హాల్లో అధికారులు ఈ ఎన్నికలు నిర్వహించారు. అమీన్పూర్, పటాన్చెరు, తెల్లాపూర్, కొల్లూర్లోని నారాయణ రావు లే ఔట్కు సంబంధించిన హౌసింగ్ ప్యానెల్కు ఈ ఎన్నికలు జరిగాయి. కొన్నేళ్లుగా సొసైటీ యాక్టీవ్గా లేకపోవడంతో వేలాది మంది ప్లాట్ ఓనర్లు డైలమాలో ఉన్నారు.
ప్రభుత్వ ఆదేశాలతో సొసైటీ ఎన్నికలు నిర్వహించి కొత్త బాడీని ఎన్నుకోవాలని నిర్ణయించి మొత్తం 9 మంది డైరెక్టర్ పదవులకు సోమవారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 1785 ఓట్లు ఉండగా 971 ఓట్లు పోలయ్యాయి. 9 డైరెక్టర్ల పోస్టులకు ఓపెన్ కేటగిరీలో 18 మంది, మహిళా కేటాగిరిలో 9 మంది పోటీ పడగా ఎస్సీ, ఎస్టీ నుంచి ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారని జిల్లా కో ఆపరేటివ్ అధికారులు కిరణ్ కుమార్, విరాజిత్ అలీ పేర్కొన్నారు.
