తగ్గిన ఎన్పీఏలు, పెరిగిన లోన్లు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ.4,070 కోట్ల నికర లాభాన్ని సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.2,168 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం ఎక్కువ. లోన్లు పెరగడం, వడ్డీ ఆదాయం మెరుగవ్వడంతో పాటు మొండిబాకీలు తగ్గడంతో బ్యాంక్ లాభం పెరిగింది. బీఓబీకి క్యూ1 లో రూ.10,997 కోట్ల నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) వచ్చింది.
ఇది ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 24.4 శాతం గ్రోత్కు సమానం. వడ్డీయేతర ఆదాయం కూడా 2.8 రెట్లు పెరిగింది. బ్యాంక్ గ్రాస్ ఎన్పీఏలు (మొండిబాకీలు) జూన్ క్వార్టర్లో ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం33.8 శాతం తగ్గి రూ.34,832 కోట్లకు దిగొచ్చింది. గ్రాస్ ఎన్పీఏల రేషియో అడ్వాన్స్ల్లో 6.23 శాతం నుంచి 3.51 శాతానికి మెరుగుపడింది. నెట్ ఎన్పీఏల రేషియో 1.58 శాతం నుంచి రికార్డ్ కనిష్టమైన 0.78 శాతానికి తగ్గిందని బీఓబీ ప్రకటించింది.
డొమెస్టిక్గా కరెంట్ అకౌంట్ డిపాజిట్లు జూన్ క్వార్టర్లో 5.5 శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.4,23,600 కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది జూన్ క్వార్టర్లో వెహికల్ లోన్లు 22.1 శాతం, హోమ్ లోన్లు 18.4 శాతం, పర్సనల్ లోన్లు 82.9 శాతం, మోర్టగేజ్ లోన్లు 15.8 శాతం, ఎడ్యుకేషన్ లోన్లు 20.8 శాతం పెరిగాయని బీఓబీ వివరించింది.
వ్యవసాయ రుణాలు 15.1శాతం పెరిగి రూ.1,27,583 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. కాగా, బీఓబీకి దేశం మొత్తం మీద 8,205 బ్రాంచులు, 10,459 ఏటీఎంలు ఉన్నాయి. గ్లోబల్గా 17 దేశాల్లో 93 ఆఫీసులను ఆపరేట్ చేస్తోంది. బ్యాంక్ షేర్లు శుక్రవారం 2 శాతం తగ్గి రూ.191 దగ్గర క్లోజయ్యాయి.