- రూ. 1.4 లక్షల కోట్లకు పెరిగిన డిజిటల్ లెండింగ్
- టాప్ లో ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా
- పర్సనల్ లోన్లే టార్గెట్
బిజినెస్ డెస్క్, వెలుగు: ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం మూడు క్లిక్స్లోనే లోన్ అమౌంట్ అకౌంట్లలో పడిపోతోంది. దేశంలో డిజిటల్గా లోన్లు ఇవ్వడం బాగా పెరిగింది. బ్యాంకులయినా కావొచ్చు లేదా ఎన్ఎఫ్సీఎల్ అయినా, ప్రస్తుతం డిజిటల్ లెండింగ్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. వీటికి తోడు ఫిన్టెక్ కంపెనీలు, లెండింగ్ యాప్లు, బారోవర్ల నుంచి డబ్బులు తీసుకొని లెండర్లకు ఇచ్చే యాప్లు..ఇలా అనేక కంపెనీలు లెండింగ్ సెగ్మెంట్ను టార్గెట్ చేస్తున్నాయి. కిందటేడాది ఏప్రిల్–డిసెంబర్ మధ్య బ్యాంకులిచ్చిన మొత్తం లోన్లలో 6 శాతం లోన్లు ఆన్లైన్లోనే జరిగాయి. 2016–17 లో ఇదే టైమ్లో ఈ వాటా కేవలం 1.5 శాతం మాత్రంగానే ఉంది. డిజిటల్ లెండింగ్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందని, ఇంకా డేటా ప్రైవసీ సమస్యలు, అనైతిక లేదా చట్టవిరుద్ధమైన సమస్యలు తలెత్తుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ వర్కింగ్ గ్రూప్ కిందటి నెలలో పేర్కొంది. కానీ, రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉంటే డిజిటల్ లెండింగ్ ప్లాట్ఫామ్లు మరింత విస్తరిస్తాయని అభిప్రాయపడింది.
పెరుగుతున్న వాడకం..
డిజిటల్ లెండింగ్లో లోన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుంది. లోన్ అప్రూవల్, రికవరీ వంటివన్నీ కూడా మొబైల్ యాప్ల ద్వారానే జరుగుతాయి. కరోనా సంక్షోభం వలన డిజిటల్కు మారడం మరింత వేగంగా జరుగుతోంది. కిందటేడాది అక్టోబర్ నాటికి దేశంలో ఇన్స్టాల్ అయిన మొత్తం యాప్లలో లోన్ యాప్స్ వాటా 4.9 శాతంగా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఈ వాటా 11 శాతానికి పెరిగిందని అనలిటిక్స్ కంపెనీ యాప్స్ఫ్లయర్ పేర్కొంది. ఆన్లైన్లో లోన్లను పంపిణీ చేయడం 2017–20 మధ్య 12 రెట్లు పెరిగిందని ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ పేర్కొంది. ఈ టైమ్లో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఇచ్చిన లోన్లు రూ. 1.4 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించింది.
పర్సనల్ లోన్లపైనే ఫోకస్..
డిజిటల్ లెండింగ్ సెగ్మెంట్లో ప్రైవేట్ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల హవా కొనసాగుతోందని ఆర్బీఐ పేర్కొంది. 2019–20 నాటికి ఈ సెగ్మెంట్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా 55 శాతానికి, ఎన్బీఎఫ్సీల వాటా 30 శాతానికి ఎగిసిందని తెలిపింది. ప్రభుత్వ బ్యాంకుల వాటా 13 శాతానికి పెరిగిందని పేర్కొంది. బ్యాంకులు ఆన్లైన్లో ఇచ్చే లోన్లలో పర్సనల్ లోన్ల వాటానే ఎక్కువగా ఉందని ఆర్బీఐ తెలిపింది. ఆ తర్వాత చిన్న వ్యాపారాలకు ఇచ్చే లోన్లు, ‘బై నౌ పే లేటర్’ లోన్లు ఉన్నాయి. ‘బై నౌ పే లేటర్’ లోన్ల వాటా బ్యాంకులిచ్చే లోన్ల విలువలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, ఇచ్చిన మొత్తం లోన్ల సంఖ్యలో 30 శాతంగా ఉంది. ఎన్బీఎఫ్ఎసీలు ఇచ్చే లోన్లలో సగం లోన్లు ఆన్లైన్లోనే జరుగుతున్నట్టు ఆర్బీఐ డేటా ద్వారా తెలుస్తోంది. కానీ, వాల్యూ పరంగా చూస్తే మాత్రం మొత్తం లోన్లలో వీటి వాటా 11 శాతంగా ఉంది. హౌసింగ్, వెహికల్స్, ఎడ్యుకేషన్ లోన్లను యాప్లు, వెబ్సైట్ల ద్వారా ఫైనాన్షియల్ సంస్థలు ఎక్కువగా ఇచ్చాయి.
పెద్ద బ్యాంకులు టాప్లో..
ఐసీఐసీఐ బ్యాంకు ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ఇచ్చిన లోన్లలో (మొత్తం లోన్ల సంఖ్యలో) 94 శాతం లోన్లను ఆన్లైన్ ద్వారానే ఇచ్చింది. 2019–20 ఇదే టైమ్లో ఈ వాటా 62 శాతంగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఆన్లైన్లో ఇచ్చే లోన్లు సెప్టెంబర్ క్వార్టర్లో 120 శాతం (పర్సనల్ లోన్ సెగ్మెంట్) పెరిగాయి. డిజిటైజేషన్ వైపు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వేగంగా మారుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. సొంతంగా యాప్లను తీసుకొస్తూ అప్పులను డిస్బర్స్ చేస్తున్నాయంటున్నారు.
ఆన్లైన్ లోన్లతో సమస్యలు..
ఆన్లైన్ లోన్లతో సమస్యలు కూడా లేకపోలేదు. ఆర్బీఐ ప్యానెల్ ప్రకారం, వ్యవస్థలో అందుబాటులో ఉన్న లోన్ యాప్లలో 50 శాతం యాప్లు చట్టవిరుద్ధమైనవే. ఈ ట్రెండ్ రానున్న కాలంలో మరింత పెరుగుతుంది. డిజిటల్ లెండింగ్ యాప్లపై కిందటేడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య 2,562 ఫిర్యాదు ఫైల్ అయ్యాయని ఈ ప్యానెల్ పేర్కొంది. దేశంలో చట్టవిరుద్ధంగా 600 లెండింగ్ యాప్లు నడుస్తున్నాయని ప్రభుత్వం కూడా పేర్కొంది. ఈ యాప్లు యాప్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉన్నాయని వివరించింది. ప్రభుత్వం వీటిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటోందని, 27 యాప్లను ఐటీ చట్టం కింద బ్లాక్ చేశామని ఐటీ మినిస్ట్రీ పేర్కొంది.
రీపేమెంట్ కష్టాలూ తప్పవు..
రీపేమెంట్ల కష్టాలు కూడా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలను వెంటాడుతున్నాయి. బ్యాంకుల రిటైల్ లోన్లు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్లు (ఎన్పీఏ) గా మారడం పెరుగుతోంది. కిందటేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య అగ్రికల్చర్, ఇండస్ట్రీ సెగ్మెంట్లలో ఎన్పీఏలు తగ్గాయి. కానీ, రిటైల్ సెగ్మెంట్లో ఎన్పీఏలు మాత్రం 1.7 శాతం నుంచి 2.1 శాతానికి పెరిగాయి. దీన్ని బట్టి బ్యాంకులు అడ్డగోలుగా లోన్లు ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు.