ముంబై : సొంత ఇల్లు కొనుక్కునే వారికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఓవైపు జీతాల కోత, ఉద్యోగాలు పోవడం వంటి సమస్యలుంటే మరోవైపు శాంక్షన్ చేసిన అప్పులు ఇవ్వడానికి మళ్లీ పే స్లిప్స్ ఇమ్మని అడుగుతున్నాయి బ్యాంకులు. అప్పులు ఇచ్చే ముందే ఈఎంఐ కట్టగలరో లేదో మరోసారి తెలుసుకోవాలనుకోవడమే దీనికి కారణం. ఇళ్ల కొనుగోలుదారులు కచ్చితంగా తమ ఈఎంఐలు చెల్లించగలరనే నమ్మకం కుదిరితేనే బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. దీంతో ఇళ్ల కొనుగోలుదారులకే కాదు, రియల్ ఎస్టేట్ డెవలపర్లకూ ఇబ్బందులెదురవుతున్నాయని ఒక ప్రముఖ బిల్డర్ వాపోతున్నారు. కొన్ని కేసుల్లో ఇప్పటికే 20 శాతం అప్పును డిస్బర్స్ చేసినా, లాక్డౌన్ తర్వాత, ఇవ్వాల్సిన మిగిలిన మొత్తాన్ని బ్యాంకులు నిలిపి వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఐతే, అప్పు తీర్చగలడా లేదా అనే విషయం తమకు చాలా ముఖ్యమైనదని ఇంకోవైపు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు చెబుతున్నాయి. ఒకవేళ తగినంత ఆదాయం లేకపోతే ట్రాన్సాక్షన్ నుంచి బయట పడటమే ఇళ్ల కొనుగోలుదారులకు మేలని సూచిస్తున్నాయి. ఎందుకంటే, ఇల్లు ఇంకా చేతికి రాకుండానే ఒక వేళ లోన్ డిఫాల్టైతే, ఇల్లు పోవడమే కాకుండా, మళ్లీ లోన్ కావాలన్నా రాదని బ్యాంకింగ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
జీతాల కోతతో శాంక్షన్ చేసిన హోమ్ లోన్స్ను బ్యాంకులు మళ్లీ పరిశీలిస్తున్నాయి. డిస్బర్స్మెంట్స్ను బ్యాంకులు నిలిపి వేస్తున్నాయి. దీంతో చాలా మంది బిల్డర్లు ఇబ్బందులపాలవుతున్నారని మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ (థానె) ప్రెసిడెంట్ అజయ్ అషార్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న 1000 ఫ్లాట్లను తాము అమ్మామని, లాక్డౌన్ ముందు దాకా బ్యాంకులు చెల్లింపులు జరిపాయని, కానీ ఆ తర్వాత నిలిపి వేశాయని పేర్కొన్నారు.
రూ. 50 లక్షలకు మించిన ప్రతీ హోమ్ లోన్నూ బ్యాంకులు మరోసారి పరిశీలిస్తున్నాయని, రెండు లేదా మూడు డిస్బర్స్మెంట్స్ ఇప్పటికే జరిగినా కూడా జాగ్రత్తపడాలనుకుంటున్నాయని క్రెడాయ్ ఎంసీహెచ్ఐ నయన్ సింగ్ చెప్పారు. అప్పులు ఇచ్చే ఉద్దేశం కానీ, ఎకానమీని కాపాడే ఉద్దేశం కానీ బ్యాంకులకు లేనట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ వద్ద ఉన్న డబ్బులను ఆర్బీఐ వద్దే ఉంచడానికే బ్యాంకులు మొగ్గుచూపుతున్నాయని విమర్శించారు.
ఆర్బీఐ డేటా ప్రకారం మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో బ్యాంకులు ఇచ్చిన హోమ్ లోన్స్ రూ. 8,255 కోట్ల మేర తగ్గిపోయాయి. పాత లోన్ల రీపేమెంట్స్ వస్తున్నాయని, కాకపోతే కొత్త శాంక్షన్లే లేవని బ్యాంకర్లు చెబుతున్నారు. లాక్ డౌన్ పిరియడ్కు ముందు క్లియర్ చేసిన లోన్ ప్రపోజల్స్కే ఇప్పుడు డిస్బర్సల్స్ జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు.