వెలుగు బిజినెస్ డెస్క్: బ్యాంకులు సేకరించే డిపాజిట్ల కంటే ఇచ్చే అప్పులు ఎక్కువయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు డిపాజిట్లతో ఇచ్చిన అప్పులు దాదాపు రెట్టింపుగా రికార్డయ్యాయి. బిజినెస్ సైకిల్ మెరుగవడమే ఇలా బ్యాంకులు ఇచ్చే అప్పులు పెరగడానికి ప్రధాన కారణం. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి బ్యాంకులు ఇచ్చిన అప్పులు 16.5 శాతం పెరిగాయి. మరోవైపు బ్యాంకులలో డిపాజిట్లు మాత్రం 9.2 శాతమే ఎక్కువైనట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా వెల్లడించింది.
అక్టోబర్ నెలలో మరింత ఎక్కువ....
అక్టోబర్ వరకు చూస్తే బ్యాంకులు ఇచ్చిన అప్పుల జోరు మరింత ఎక్కువైంది. ఈ నెలలో క్రెడిట్ గ్రోత్ 18 శాతానికి చేరింది. డిపాజిట్లు మాత్రం 9.5 శాతమే పెరిగాయి. దీంతో బ్యాంకులు తమ క్రెడిట్టు డిపాజిట్ రేషియోను 80 శాతానికి పెంచుకుంటున్నాయి. క్రెడిట్ గ్రోత్ ఇదే లెవెల్లో ఎంతకాలం కొనసాగుతుందనేది కచ్చితంగా తెలీకపోవడంతో బ్యాంకులు డిపాజిట్ల సమీకరణపై అంతగా ఆలోచించడం లేదని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ కారణంగానే వడ్డీ రేట్ల పెంపుదల ఆఫర్లను లిమిటెడ్గానే ప్రకటిస్తున్నాయని పేర్కొంటున్నారు.
ఎస్బీఐ క్రెడిట్ గ్రోత్ 20 శాతం..
దేశంలోనే అతి పెద్ద బ్యాంకయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ గ్రోత్ సెప్టెంబర్ చివరినాటికి 20 శాతానికి చేరింది. ఏడాది మొదట్లో క్రెడిట్ గ్రోత్ 12 శాతం దాకా ఉండొచ్చని ఎస్బీఐ అంచనా వేసింది. డిపాజిట్లతో పోలిస్తే క్రెడిట్ గ్రోత్ రెట్టింపు వేగం చూపిస్తున్నప్పటికీ, తగినన్ని డిపాజిట్లు తమ వద్ద ఉన్నాయని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా ఇటీవల చెప్పారు. బిజినెస్ సీజన్ బిజీ కావడం వల్లే క్రెడిట్ జోరందుకుందని ఖారా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి క్రెడిట్ గ్రోత్ 14–16 శాతం దాకా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, సర్వీస్ సెక్టార్లోని కంపెనీలు ఎక్కువగా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుంటున్నట్లు ఖారా వివరించారు.
ఆ కంపెనీలు తయారు చేసే వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతుంటే బ్యాంకుల నుంచి తీసుకునే అప్పులూ ఆ మేర పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. మరోవైపు డిపాజిట్లు వేగంగా పెరగకపోవడం బ్యాంకులను కొంత కలవరపెడుతోంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లలో స్థిరత్వం రావల్సి ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా చెప్పారు. రేట్ల విషయంలో కొంత ఫ్లెక్సిబుల్గా వ్యవహరించడమే మేలని, రాబోయే నెలల్లో రేట్లు స్థిరపడితే దానికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోవడం వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. డిపాజిట్లపై వడ్డీ రేట్లు స్థిరపడేదాకా కొత్త డిపాజిట్లను తెచ్చుకోవడానికి కొంత ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్రెడిట్ గ్రోత్ ప్రస్తుతం జోరుగా ఉన్నా, రాబోయే నెలల్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేమని చద్దా పేర్కొన్నారు.