ముంబై: ఎన్ఆర్ఐల నుంచి డిపాజిట్లను ఆకర్షించడానికి పలు బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేటును ఏకంగా 350 బేసిస్ పాయింట్ల (3.50 శాతం) వరకు పెంచాయి. 3 నుంచి 5 ఏళ్ల ఎన్ఆర్ఐ డిపాజిట్లపై అయ్యే పూర్తి హెడ్జింగ్ ఖర్చును తామే భరిస్తామని ఆర్బీఐ ప్రకటించడంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
కాగా, బ్యాంకులు ఫారిన్ కరెన్సీ డిపాజిట్లు స్వీకరించినప్పుడు హెచ్చుతగ్గుల వల్ల నష్టపోకుండా ఉండడానికి ఈ కరెన్సీలకు వ్యతిరేకంగా హెడ్జింగ్ చేస్తాయి. ఈ ఖర్చును బ్యాంకులే భరించాల్సి ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఖర్చులను తామే భరిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. రూపాయి పతనాన్ని ఆపడానికి, డాలర్లను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్:3 నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం పెంచి 6 శాతానికి చేర్చింది.
- ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 3 ఏళ్ల డిపాజిట్లపై 7.1శాతం, 5 ఏళ్లపై 7శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
- యెస్ బ్యాంక్: కాలపరిమితిని బట్టి 7శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ రేట్లను నిర్ణయించింది.
ఈ చర్యలతో ఇండియన్ బ్యాంకులు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సుమారు 35–40 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సేకరించొచ్చని అంచనా. ఆర్బీఐ మాత్రం వడ్డీరేట్లను మార్చలేదు.
