- కొన్ని లోన్లకు అయినా చాన్సివ్వాలి
- ప్రభుత్వానికి ప్రైవేటు బ్యాంకర్ల రిక్వెస్ట్
న్యూఢిల్లీ: కొన్ని ఎంపిక చేసిన కేసులలో మారటోరియంకు తమను అనుమతిస్తే మేలని దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు కోరుకుంటున్నాయి. కొన్ని అప్పుల విషయంలో రీస్ట్రక్చరింగ్కు అవకాశమివ్వాలని కూడా అవి భావిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్తో జరిగిన మీటింగ్లో ప్రైవేట్ బ్యాంకుల చీఫ్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్–జూన్ 2021 మధ్య కాలానికి వర్తించేలా ఈ మారటోరియం ఉండాలని ప్రైవేటు బ్యాంకులు భావిస్తున్నాయి. దీనివల్ల, సెకండ్వేవ్ దెబ్బకు ఏప్రిల్ నుంచి చెల్లింపులు జరపని అకౌంట్లు జూన్ నెలాఖరుకు మొండిబాకీలు (ఎన్పీఏలు) కాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీము కింద ఈ అకౌంట్లలో చాలా వాటికి వెసులుబాటు కలగనుందని, కానీ దానికి ఆగస్టు–సెప్టెంబర్ దాకా టైముందని బ్యాంకర్లు చెబుతున్నారు. అందుకే, ఇప్పుడు మారటోరియం ప్రకటించడం మేలని అంటున్నారు. మే 5 నాడు ప్రకటించిన రిలీఫ్ స్కీము అమలు ఎలా ఉందో మంగళవారం నాటి మీటింగ్లో గవర్నర్ రివ్యూ చేసినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. సెకండ్వేవ్తో ఇబ్బందులెదుర్కొంటున్న వారికి అప్పులు అందించాలని గవర్నర్ ఈ మీటింగ్లో ప్రైవేటు బ్యాంకులను కోరినట్లు పేర్కొంది. ఏవియేషన్, హోటల్స్, హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు వంటి అకౌంట్లకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ అవకాశం కల్పించేలా తమను అనుమతించాలని కూడా ప్రైవేటు బ్యాంకులు కోరుతున్నాయి. అయితే మే 5 నాటి ఆర్బీఐ ఆదేశాల ప్రకారం రిటెయిల్, స్మాల్ బిజినెస్ బారోవర్లకు మాత్రమే ఆ వెసులుబాటు ప్రకటించారు. ఇలా వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్ అమలు వల్ల ఆ అకౌంట్లు ఎన్పీఏలుగా మారకపోవడంతోపాటు, పేమెంట్లు జరపడానికి రెండు నుంచి మూడేళ్ల అదనపు టైము దొరుకుతుందని ప్రైవేటు బ్యాంకర్లు చెబుతున్నారు.గత ఏడాది మారటోరియంను ఎక్కువగా ఇండివిడ్యువల్సే వాడుకున్నారు. తమ రేటింగ్పై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుందనే ఆలోచనతో పెద్ద కార్పొరేట్లు ఆ మారిటోరియం ఉపయోగించుకోలేదని బ్యాంకింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
చిన్న బిజినెస్లపై ఆర్బీఐ సర్వే
- సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తెలుసుకోడానికే
రిటెయిల్ స్టోర్లు, రెస్టారెంట్లు, మాల్స్, హాస్పిటాలిటీ రంగాలలోని స్మాల్, మీడియం బిజినెస్లపై సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎలా ఉందో ఆర్బీఐ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఒక సర్వే నిర్వహిస్తోంది. ఆయా రంగాలలోని కంపెనీలతో ఆన్లైన్ మీటింగ్లు చేపట్టాల్సిందిగా బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఏ రంగాలపై ఎక్కువగా పడిందో తెలుసుకోవాలని ఆర్బీఐ కోరుకుంటోందని ఒక బ్యాంకరు చెప్పారు. మొదటి దఫా మారటోరియం తీసుకున్న వారే ఇప్పుడు కూడా ట్రబుల్స్లో ఉన్నారని ఆ బ్యాంకరు వెల్లడించారు. అయితే, ఈ చొరవపై వివరాలు వెల్లడించడానికి ఆర్బీఐ ప్రతినిధి ముందుకు రాలేదు. తన బ్యాంకరు, ఆర్బీఐతో జూమ్ కాల్లో పాల్గొన్నట్లు ఒక రిటెయిలర్ వెల్లడించారు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉందనేది నేరుగా తెలుసుకోవాలనేది ఆర్బీఐ ఆలోచనగా ఆ రిటెయిలర్ పేర్కొన్నారు. కొత్త రిలీఫ్ ప్యాకేజ్ తయారీ లేదా అదనంగా అప్పులివ్వడం అనే రెండు అంశాల కోసం ఆర్బీఐ బహుశా ఈ సర్వే చేపట్టి ఉండొచ్చని ఎక్స్పర్టులు అంటున్నారు. దేశవ్యాప్తంగా 80 శాతం స్టోర్లు మూతపడ్డాయని రిటెయిలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) చెబుతోంది. రిటెయిల్ రంగంలో పెట్టుబడులు రూ. 2.5 లక్షల కోట్ల దాకా ఉంటాయని, ఇందులో రూ. 75 వేల దకోట్ల దాకా అప్పులుండొచ్చని, అవి ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉందని పేర్కొంది. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా కిందటి వారంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకుర్కు ఇదే విషయం వెల్లడించినట్లు చెబుతున్నారు. తమను ఆదుకోవల్సిందిగా ఈ సందర్భంగా మంత్రిని కోరారని పేర్కొంటున్నారు. మొదటిసారి ఇచ్చిన 20 శాతం టాప్ అప్ లోన్ ఇప్పటికే వాడేసుకున్నామని, తాజాగా సెకండ్వేవ్తో లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఈ రంగం ప్రతినిధులు చెబుతున్నారు. అదనంగా లిక్విడిటీ కోసం ఠాకూర్ను రిక్వెస్ట్ చేసినట్లు వారు వెల్లడించారు.