- నేడు బంగ్లాతో తొలి టీ20 మ. 1.30 నుంచి
మీర్పూర్: నాలుగు నెలల విరామం తర్వాత ఇండియా విమెన్స్ టీమ్ మళ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్లో బరిలోకి దిగుతోంది. టీ20, వన్డే సిరీస్ ల కోసం బంగ్లాదేశ్ టూర్కు వెళ్లిన హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఇండియా మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో పోటీ పడనుంది. చివరగా ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆడిన టీమ్లో పలువురు క్రికెటర్లు మార్చిలో విమెన్స్ ప్రీమియర్ లీగ్లో పాల్గొన్నారు. అనుకోకుండా వచ్చిన గ్యాప్ తర్వాత ఇండియా టీమ్ తమను చాన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంది.
ఫిట్నెస్, బౌలింగ్, ఫినిషర్స్ తదితర విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. అందుకు బంగ్లాదేశ్ టూర్ను సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఈ టూర్లో పలువురు యంగ్ ప్లేయర్లను టీమ్ పరీక్షించే చాన్సుంది. కొత్తగా జట్టులోకి వచ్చిన ఆంధ్ర అమ్మాయి అనూషా బారెడ్డి, రాశి కనోజియా, ఉమా ఛెత్రికి చాన్స్ రావొచ్చు. ఈ టూర్కు ముందు హర్మన్ అండ్ కో బెంగళూరులోని ఎన్సీఏలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు. కాగా, టీ20ల తర్వాత ఈ నెల 16 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.