న్యూఢిల్లీ: ఐపీఎల్–2022 కోసం బీసీసీఐ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది రెండు కొత్త ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం 10 టీమ్లతో లీగ్ను నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తోంది. ఇందులో భాగంగా రెండు కొత్త ఫ్రాంచైజీల ఏర్పాటుకు మూహూర్తం దాదాపుగా ఖరారైంది. ఆగస్ట్లో రెండు టీమ్లకు సంబంధించిన టెండర్లను పిలవనున్నారు. అక్టోబర్లో ఫ్రాంచైజీలను కన్ఫామ్ చేసే చాన్స్ ఉంది. అయితే ఫ్రాంచైజీల బేస్ప్రైస్ విషయంలోనే బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ రెండు ఫ్రాంచైజీల బేస్ప్రైస్ రూ. 1800 కోట్ల నుంచి రూ. 3000 కోట్ల మధ్య ఉండే చాన్స్ ఉంది. అయితే కొత్త ఫ్రాంచైజీల కోసం డిమాండ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్ ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. దీనికోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు సిద్ధమవుతోంది. ఇక రెండో ఫ్రాంచైజీ కోసం పుణె, లక్నో, కాన్పూర్, గౌహతి, ఇండోర్, కొచ్చి, రాయ్పూర్, త్రివేండ్రమ్ రేస్లో ఉన్నాయి. ఇందులో ఏ సిటీని సెలెక్ట్ చేస్తారో చూడాలి. సెకండ్ న్యూ ఫ్రాంచైజీ కోసం సంజీవ్ గోయెంకా (కోల్కతా), అరబిందో ఫార్మా (హైదరాబాద్), టోరెంట్ గ్రూప్ (గుజరాత్)తో పాటు మరికొన్ని బడా బిజినెస్ సంస్థలు పోటీపడుతున్నట్లు సమాచారం.
నలుగుర్ని రిటెయిన్..
ఫ్రాంచైజీల సంఖ్య పెరుగుతుండటంతో.. వాటికి ప్లేయర్లను కూడా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో మిడ్ డిసెంబర్లో మెగా ఆక్షన్ను నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. వాస్తవానికి 2021లోనే ఈ ఆక్షన్ ఉండాల్సి ఉన్నా.. కరోనా దెబ్బకు ఏడాది వాయిదా పడింది. ఇక ప్లేయర్ల రిటెన్షన్, ఆటగాళ్ల సాలరీ, ఫ్రాంచైజీల జీతాల నిధి వంటి విషయాలపై ఇప్పటికే బీసీసీఐ కసరత్తులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీల సాలరీ పర్స్ను కూడా రూ. 85 నుంచి 90 కోట్లకు పెంచారు. రిటెయిన్ ప్లేయర్ల విషయంలో బీసీసీఐ స్పష్టతకు వచ్చింది. ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకునే చాన్స్ ఉంది. ఇందులో ముగ్గురు ఇండియన్స్, ఒకరు ఫారిన్ ప్లేయర్. లేదంటే ఇద్దరు ఇండియన్, ఇద్దరు ఫారిన్ ప్లేయర్లను ఎంచుకోవచ్చు. ముగ్గురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకుంటే... రూ. 15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు చెల్లించాలి. ఇద్దర్ని చేసుకుంటే రూ. 12.5 కోట్లు, రూ. 8.5 కోట్లు ఇవ్వాలి. ఒక్కర్నే చేసుకుంటే రూ. 12.5 కోట్లు సాలరీ కింద ఇవ్వాలి. 10 ఫ్రాంచైజీలు కావడంతో మ్యాచ్ల సంఖ్య కూడా 90కి పైగానే ఉండే అవకాశం ఉంది. షెడ్యూల్ పెరుగుతుండటంతో.. లాంగ్ విండో కోసం బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది. ఇక బ్రాడ్కాస్ట్, మీడియా రైట్స్ రెవెన్యూ విషయంలోనూ బీసీసీఐ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈసారి పెద్ద మొత్తంలో రైట్స్ను అమ్మాలని, జనవరిలో ఈ వ్యవహారం కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఓవైపు ఐపీఎల్–2022కు సంబంధించిన అంశాలను కొలిక్కి తెస్తూనే.. మరోవైపు యూఏఈలో సెకండ్ ఫేజ్ మ్యాచ్లకు సంబంధించిన లాజిస్టిక్స్ను కూడా పట్టాలెక్కించేందుకు బోర్డు సిద్ధమవుతోంది.