వినాయక చవితి, ఓనమ్ ఫెస్టివల్స్ తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందట. నాలుగు రాష్ట్రాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా ఉందట. ఈ రాష్ట్రాల్లో ఫెస్టివల్ సీజన్ తర్వాత సగటున 50 శాతానికిపైగా కేసులు నమోదయ్యాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఈ లిస్ట్లో తెలంగాణ కూడా ఉంది. మన రాష్ట్రంలో ఆగస్టు తర్వాత కరోనా కేసుల సంఖ్య 49.8 శాతం పెరిగిందని ఈ రిపోర్ట్ చెబుతోంది. దసరా, దీపావళి సీజన్ రానున్న నేపథ్యంలో కరోనా విషయంలో అలర్ట్ గా ఉండాలని హెచ్చరించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో ఆగస్టు తర్వాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ డేటా వెల్లడించింది. ఆగస్టు 22న వినాయకచవితి, అదే నెలలో ఓనమ్ ఫెస్టివల్స్ వచ్చాయి. దీంతో జనం బయట తిరగడం ఎక్కువైందని, దీని ప్రభావంతో కేసుల సంఖ్య పెరిగిందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ఈ ఫెస్టివల్స్ తర్వాత ఏపీలో కేసుల సంఖ్య 2.93 లక్షలు పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 67 శాతం. మహారాష్ట్ర విషయానికి వస్తే ఫెస్టివల్స్ తర్వాత 3.7 లక్షల కేసులు పెరిగాయి. మొత్తం కేసుల్లో ఇది 46 శాతం. అదే తెలంగాణ విషయం చూస్తే గణేశ్ చతుర్థి తర్వాత 62 వేల కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 50 శాతం వరకూ ఉంది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైన కేరళలో ఓనమ్ తర్వాత కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. దాదాపు 1.38 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మొత్తం కేసుల్లో 65 శాతం వరకూ ఉంది. కరోనా కేసుల పెరుగుదలకు ఓనమ్ ఫెస్టివలే కారణమని ఈ నెల మొదట్లో కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ప్రకటించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి చేపట్టిన ఆందోళనల వల్ల కూడా కరోనా కేసులు పెరిగాయని ఆరోపించారు.
ఇది మిగతా రాష్ట్రాలకు వార్నింగ్
ఈ నాలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు మిగతా రాష్ట్రాలకు హెచ్చరికలుగా మారాయి. అక్టోబర్–నవంబర్లో మళ్లీ దసరా, దీపావళి పండుగల సీజన్ రానుంది. దీంతో జనం మరింత ఎక్కువగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు మరింత పెరగవచ్చని ఎక్స్పర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘గణేశ్ చతుర్థి, ఓనమ్ ఫెస్టివల్స్ జరిగిన రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. సెలబ్రేషన్స్ కోసం జనం బయటకు రావడమే దీనికి కారణం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనట్లయితే దసరా వేడుకల తర్వాత పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురుకావొచ్చు”అని ఎస్బీఐ రిపోర్ట్ వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా దసరా, దీపావళి ఫెస్టివ్ సీజన్లో కేసులు పెరగవచ్చని, అందువల్ల జనం తప్పనిసరిగా మాస్కులు అని సూచించింది. మన దేశంలో ఇప్పటి వరకూ 70 లక్షల కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 15 లక్షల కేసులు రికార్డయ్యాయి. ఎకానమీ రీ ఓపెనింగ్, ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో కరోనా కేసులను తగ్గించే లక్ష్యంతో జనంలో మాస్కుల వాడకం, ఫిజికల్ డిస్టెన్స్, చేతులు కడగడంపై అవగాహన పెంచేందుకు ప్రధాని నరేంద్రమోడీ జన్ ఆందోళన్ క్యాంపెయిన్ను స్టార్ట్ చేశారు.