సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారబోతున్న బెల్లంపల్లి

సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారబోతున్న బెల్లంపల్లి

 

  • సాఫ్ట్​వేర్ ​కంపెనీలకు అడ్డాగా మారిన పారిశ్రామిక ప్రాంతం 
  •     ముంబై నుంచి వచ్చి సొంతగడ్డపై  వాల్యూ పిచ్ ​ఏర్పాటు చేసిన వెంకటరమణ 
  •     సనాతన అనలైటిక్స్​తో   దూసుకుపోతున్న ‘ఎర్ర’ బ్రదర్స్​
  •     స్థానిక నిరుద్యోగ యువతకే  ఎక్కువ ఉద్యోగావకాశాలు

మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్, బెంగళూరు,  ముంబై, పుణె లాంటి సిటీల పేర్లే వినిపిస్తాయి. కానీ, ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్​ ఐటీ కంపెనీలకు అడ్డాగా మారబోతోంది. ఇక్కడ వ్యాల్యూ పిచ్​ఈ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సనాతన అనలైటిక్స్ అండ్ రిక్రూట్​మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఐటీ కంపెనీలను స్థానికులే ఏర్పాటు చేశారు. ఈ రెండు కంపెనీల్లో దాదాపు A300 మందికిపైగా యువత ఉద్యోగాలు చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై నగరాల్లోని మల్టీ నేషనల్ ​కంపెనీల్లో జాబ్స్​వదులుకొని పుట్టిన గడ్డకు తమవంతు సేవలందించాలనే సంకల్పంతో స్థానికులే వీటిని స్థాపించారు. ఇంటర్, డిగ్రీ చదివిన వారికి ట్రైనింగ్​ఇచ్చి మరీ తమ కంపెనీల్లోనే జాబ్స్​ ఇస్తున్నారు. వీరి స్పూర్తితో రానున్న కొద్దిరోజుల్లోనే బెల్లంపల్లి ఐటీ కంపెనీలకు హబ్​గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

2020లో మొదలైన వ్యాల్యూ పిచ్​ఈ టెక్నాలజీస్​..
బెల్లంపల్లికి చెందిన రిటైర్డ్​ సింగరేణి ఆఫీసర్​ 

చెన్నమాధవుని శ్రీరాములు, పద్మజ దంపతుల కొడుకు సీహెచ్.వెంకటరమణ ఐసీడబ్ల్యూఏఐ పూర్తి చేసి ఓ ఎంఎన్​సీలో కొంతకాలం జాబ్​చేశారు. 2006లో ముంబైలో వ్యాల్యూ పిచ్​ఈ టెక్నాలజీస్​ప్రైవేట్​లిమిటెడ్​అనే ఐటీ కంపెనీని స్థాపించి తన కంపెనీలో వందల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ముంబైలోనే స్థిరపడ్డ ఆయన కోవిడ్​ టైమ్​లో బెల్లంపల్లికి వచ్చినప్పుడు తన ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నారు. 2020 నవంబర్​లో బెల్లంపల్లి కాల్​టెక్స్​లో వ్యాల్యూ పిచ్​ ఈ టెక్నాలజీస్​ను ఏర్పాటు చేశారు. డిగ్రీ చదివిన యువతీ యువకులకు ట్రైనింగ్​ ఇచ్చి తన కంపెనీలో వివిధ హోదాల్లో నియమించుకున్నారు. వ్యాల్యూ పిచ్​ గ్రూప్​ను విస్తరిస్తూ వెరిఫై 24×7, ట్యాగ్స్ 24×7, బీటూబీ టెస్టర్స్, వీపీ ఆగ్రో వంటి అనుబంధ సంస్థలను ఏర్పాటు చేశారు. పది మందితో ప్రారంభించిన ఈ కంపెనీలో ఇప్పుడు 200 మంది పనిచేస్తున్నారు. నెలకురూ.20వేల నుంచి రూ.90 వేల దాక వేతనాలు పొందుతున్నారు. ఈ కంపెనీలో 85 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే నియమం పెట్టుకున్నారు. మిగతా 15 శాతంలో చుట్టుపక్కలున్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలతో పాటు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వారు పనిచేస్తున్నారు.  

2017లో ప్రారంభమైన సనాతన అనలైటిక్స్​ 

బెల్లంపల్లికి ఎర్ర రంగనాథ రాజు, శ్రీనాథరాజు, సాయినాథరాజు 2017లో సనాతన అనలిటిక్స్​ అండ్​ రిక్రూట్​మెంట్​సర్వీస్ అనే ఐటీ కంపెనీని స్థాపించి 100 వంద మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ ముగ్గురన్నదమ్ములు ఎంబీఏ చదివి హైదరాబాద్​లోని  ఎంఎన్​సీల్లో పనిచేశారు. రంగనాథరాజు టీవీఎస్ గ్రూప్​లో చీఫ్​​ఎకానమిస్ట్​గా, శ్రీనాథరాజు కోవినెంట్​ఇండియా అనే రిక్రూట్​మెంట్​ కంపెనీలో హైదరాబాద్ ​యూనిట్​ హెడ్​గా, సాయినాథరాజు సిగ్నిటీ జెన్​క్యూ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఇంటర్నేషన్​ బిజినెస్​ డెవలప్​మెంట్​ మేనేజర్​గా పనిచేశారు. తాము పుట్టిపెరిగిన ఊరి కోసం ఉద్యోగాలను వదులుకొని వచ్చి సాఫ్ట్​వేర్​ కంపెనీని స్థాపించారు. రంగనాథరాజు భార్య హారిక లైనెక్స్​ కంపెనీలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ గా, శ్రీనాథరాజు భార్య కీర్తన క్రిష్ణవేణి టాలెంట్​ స్కూల్​లో టీచర్​గా, సాయినాథరాజు భార్య సాహితీ విప్రోలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేశారు. వీరు ముగ్గురు తమ జాబ్స్​కు రిజైన్​ చేసి సనాతన అనలైటిక్స్​లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2017లో మొదట ఐటీ రిక్రూట్​మెంట్​ (హెచ్​టుహెచ్) సంస్థను ఏర్పాటు చేసి ప్రస్తుతం 75 ఎంఎన్​సీలకు సేవలందిస్తున్నారు. ఏడీపీ, ఎస్​అండ్​పీ క్యాపిటల్​ఐక్యూ, సర్వీస్​నౌ, ఐహెచ్​ఎస్​, టావెంట్​వంటి 75 కంపెనీలతో టై అప్​ అయ్యారు. ఎకానమిక్​ రీసెర్చ్​లో టీవీఎస్ ​గ్రూప్​, సియామ్​ తదితర ఆటోమోబైల్​ కంపెనీలకు బిజినెస్​ డెవలప్​మెంట్​ రీసెర్చ్ సర్వీసెస్​ అందిస్తున్నారు. స్మాల్​ బాస్కెట్​పేరుతో రిటెయిల్​ఈ కామర్స్​ సంస్థను స్థాపించి బెల్లంపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సేవలందించారు. కొవిడ్​టైమ్​లో బంద్​కావడంతో షాప్స్ ​అండ్ ​మీ అనే మొబైల్​యాప్​ ద్వారా బెల్లంపల్లి నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో హోమ్​ డెలివరీ సర్వీసులు అందిస్తున్నారు. సనాతన లో పనిచేస్తున్న ఉద్యోగులు రూ.20 వేల నుంచి రూ.1.8 లక్షల శాలరీ డ్రా చేస్తుండడం విశేషం.  

కంపెనీలను విజిట్​చేసిన కేటీఆర్ 

బెల్లంపల్లిలో విజయవంతంగా నడుస్తున్న రెండు ఐటీ కంపెనీలను ఈ నెల 8న  ఐటీ మినిస్టర్​ కేటీఆర్ విజిట్​ చేశారు. వారు అందిస్తున్న సేవల గురించి తెలుసుకొని అభినందించారు. వీరి నుంచి తాను ఎంతో  స్ఫూర్తి పొందానని ట్విటర్​లో ప్రశంసించారు. బెల్లంపల్లిలో ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా యువతకు ట్రైనింగ్​ఇచ్చేందుకు స్కిల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో వ్యాల్యూ పిచ్​లో మరో 800 మందికి, సనాతన అనలైటిక్స్​లో 2వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలనే భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. దీంతో పలు ఐటీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలకు చెందిన మరికొన్ని ఐటీ కంపెనీల చూపు ఇప్పుడు బెల్లంపల్లిపై పడబోతుంది. 

మరో 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తా..

నేను పుట్టిన ఊరికి నా వంతు ఏదైనా చేయాలని ఐటీ కంపెనీ పెట్టాను. కరోనా టైంలో ముంబై నుంచి వచ్చినప్పుడు ఫ్రెండ్స్​తో ఆలోచనలు పంచుకున్నాను. యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలు లేకపోవడం చూసి బాధనిపించింది. నా తల్లిదండ్రులు కూడా ఏదైనా చేయమని సలహా ఇచ్చారు. దీంతో నా భార్య కిరణ్ మృదుల, నేను కలిసి ఐటీ కంపెనీ స్థాపించాం. 200 మందికి జాబ్స్ ఇచ్చాం. మరో 800 మందికి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. - సీహెచ్.వెంకటరమణ, వ్యాల్యూ పిచ్​ సీఈవో

 2వేల మందికి జాబ్స్​ఇవ్వాలన్నదే లక్ష్యం...  

మేము ముగ్గురం అన్నదమ్ములం. మల్టీనేషనల్​ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా సంతృప్తి లేదు. బెల్లంపల్లి ఏరియాలో నిరుద్యోగ యువత కోసం సనాతన అనలైటిక్స్​ కంపెనీ స్థాపించాం. భర్త చనిపోయి పిల్లలను పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఓ మహిళకు ట్రైనింగ్​ ఇచ్చి జాబ్ ​కల్పించాం. ఇప్పుడామె యూఎస్​ ఐటీ రిక్రూట్​మెంట్​ టీంను లీడ్​ చేస్తోంది. ఓ తాపీమేస్ర్తీ కొడుకు ఓ ఎంఎన్​సీకి రిక్రూట్​మెంట్ ​హెడ్​. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం. - ఎర్ర రంగనాథరాజు, సనాతన అనలైటిక్స్​ సీఈవో