కోల్కతా: టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న పేసర్ మహ్మద్ షమీ (5/38) రంజీ ట్రోఫీలో దుమ్మురేపాడు. మ్యాచ్ మొత్తంలో 8 వికెట్లు తీయడంతో.. మంగళవారం ముగిసిన గ్రూప్–సి ఎలైట్ మ్యాచ్లో బెంగాల్ 141 రన్స్ తేడాతో గుజరాత్పై గెలిచింది. దాంతో 6 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. 170/6 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన బెంగాల్ రెండో ఇన్నింగ్స్ను 54 ఓవర్లలో 214/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనుస్తుప్ మజుందార్ (58), ఆకాశ్ దీప్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు.
ఇక బెంగాల్ నిర్దేశించిన 327 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 45.5 ఓవర్లలో 185 రన్స్కు ఆలౌటైంది. ఉర్విల్ పటేల్ (109 నాటౌట్) సెంచరీ చేయగా జైమిత్ పటేల్ (45) అండగా నిలిచాడు. కానీ బెంగాల్ బౌలర్లు షమీ, షాబాజ్ అహ్మద్ (3/60) ధాటికి గుజరాత్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఇన్నింగ్స్లో 9 మంది సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇందులో ఆరుగురు డకౌటయ్యారు. ఆకాశ్ దీప్ ఒక్క వికెట్ తీశాడు. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో 9 వికెట్లు తీసిన షాబాజ్ అహ్మద్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రీఎంట్రీకి రెడీగా ఉన్నా..
రంజీ ట్రోఫీ తొలి రెండు మ్యాచ్ల్లో సూపర్ షో చూపెట్టిన షమీ.. పూర్తి ఫిట్నెస్తో ఉన్నానని వెల్లడించాడు. టీమిండియాలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ‘నేను కష్టపడుతున్న దానికి అదృష్టం కూడా తోడైందని నమ్ముతున్నా. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆడాలని కోరుకుంటారు. కాబట్టి నేనూ దానికి రెడీగా ఉన్నా. ఫిట్గా ఉండాలని కోరుకోవడమే నాకు ప్రేరణ. దానివల్ల టీమిండియాకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండొచ్చు.
గ్రౌండ్లో మెరుగైన పెర్ఫామెన్స్ చూపెట్టొచ్చు. మిగిలినది సెలెక్టర్ల పని. ప్రస్తుతం మానసికంగా, శారీరకంగా చాలా బాగున్నా’ అని రంజీ మ్యాచ్ తర్వాత షమీ పేర్కొన్నాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి పోయిందన్నాడు. చీలమండ సర్జరీ తర్వాత తాను పూర్తి ఫిట్గా ఉన్నానని వెల్లడించిన బెంగాల్ పేసర్ అన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు.
