బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిజినెస్ మ్యాన్ సీజే రాయ్ శుక్రవారం(జనవరి 30) ఆత్మహత్య చేసుకున్నాడు. తన కార్యాలయంలో పిస్టల్ తో కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు చెప్పారు. రాయ్ ఆఫీసులో ఐటీ సోదాలు జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు.
విచారణలో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఐటీ అధికారులు కోరగా.. గదిలోకి వెళ్లిన రాయ్ తన పిస్టల్ తో కాల్చుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాయ్ ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాయ్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.
సీజే రాయ్ ఆఫీసులో శుక్రవారం తెల్లవారుజామునుంచే ఐటీశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రోజంతా జరిగిన ఈ రైడ్స్లో రాయ్ ని దర్యాప్తు అధికారులు విచారించారు. మధ్యాహ్నం3.15 గంటల సమయంలో రాయ్ ని ఐటీ అధికారులు ప్రశ్నించే సమయంలో ఈ ఘటన జరిగింది. విచారణ సమయంలో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని కోరగా.. గదిలోకి వెళ్లిన రాయ్ ..అక్కడే పిస్టల్ తో షూట్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు.
రాయ్ గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే తుపాకీ పేలుడు శబ్దం వినిపించింది.. అతని ఛాతిపై బుల్లెట్ గాయాలున్నాయి. వెంటనే స్పందించిన ఐటీ అధికారులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాయ్ చనిపోయాడని కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు.
గత మూడు రోజులుగా రాయ్ ఆఫీసులు, ఇళ్లపై కేరళ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంగా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
