జస్ట్ ఒకే ఒక్క పోస్ట్.. అభిమానులకు కోపం తెప్పించింది. వెదికి పట్టి మరీ పిచ్చి కొట్టుడు కొట్టేలా చేసింది. అంతటితో ఆగలేదు బట్టలూడ దీసి రోడ్లపై పరుగెత్తించారు. మా నాయకుడినే అవమానిస్తావా.. ఇలాంటి పోస్టులు పెడితే ఎవరికైనా ఇది గతి అంటూ హెచ్చరించారు. ముంబైకి ప్రముఖ రాజకీయ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓ యువకుడిని చితకబాది, ఆ తర్వాత వీధుల్లో ఊరేగించిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్ర నవనిర్మాణసేన(MNS), శివసేన యూబీటీ కార్యకర్తలు ఓ యువకుడిని అర్థనగ్నంగా రోడ్డుపై ఈడ్చుకెళ్తున్నవీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్ల కామెంట్లతో బ్లాగ్ బాక్స్ నిండిపోయింది.
ఏం జరిగిందంటే...
గత కొన్ని రోజులుగా ముంబైకి చెందిన సూరజ్ మహేంద్ర షిర్కే అనే యువకుడు.. రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రే, ఆదిత్య థాక్రేలపై ఫేస్ బుక్, ఇతర సోషల్మీడియా సైట్లలో అవమాన కరమైన ,అసభ్యకరమైన పోస్ట్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల ఆగ్రహానికి గురి చేశాయి.తమ నాయకులను అవమానించారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల థాక్రే బ్రదర్స్ కలయికను సూరజ్ ప్రశ్నిస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ అవమాన కరమైన పోస్టులు పెట్టాడు.దీంతో నలసోపారా ప్రాంతంలో సూరజ్ ఉన్నాడని గుర్తించిన పార్టీ కార్యకర్తలు అతనికి దేహశుద్ది చేశారు. ఎంఎన్ ఎస్ సబ్ డివిజనల్ అధ్యక్షుడు కిరణ్ నకాషే, అతని అనుచరులు సూరజ్ ఓ ఇంట్లో ఉండగా లోపలికి చొరబడి తీవ్రంగా కొట్టారు. బట్టలూడదీసి అర్థనగ్నంగా కిలోమీటరున్నర దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను నకాషే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దేవుళ్లుగా భావించే మా నాయకులపై ఎవరైనా అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని రాశారు.
ఈ ఘటన నలసోపారా ప్రాంతంలో ఉద్రిక్తతకు దారి తీసింది. భారీగా పోలీసులు మోహరించారు. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో షేర్ అవుతుండటంతో మాబ్ జస్టిస్, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి కేసులను పరిష్కరించడంలో పోలీసుల పాత్ర గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
