ట్రంప్‎ను చంపేందుకు ఇరాన్ కుట్ర.. వాళ్లకి ఆయనే ప్రథమ శత్రువు: బెంజమిన్ నెతహ్యహు

ట్రంప్‎ను చంపేందుకు ఇరాన్ కుట్ర.. వాళ్లకి ఆయనే ప్రథమ శత్రువు: బెంజమిన్ నెతహ్యహు

టెల్ అవీవ్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. వరుసగా మూడు రోజుల నుంచి ఇరుదేశాల పరస్పరం బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతహ్యహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‎ను చంపేందుకు ఇరాన్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇరాన్ తమ అణు కార్యక్రమానికి ముప్పుగా ట్రంప్‎ను గుర్తించింది. ఇరాన్‎కు ట్రంపే ప్రథమ శ్రతువని అన్నారు. 

ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడిని.. ఇరాన్‎తో జరిగిన నకిలీ ఒప్పందాన్ని ఆయన రద్దు చేశారని పేర్కొన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దని.. అందుకోసమే మా పోరాటమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‏ను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపించారు. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని చాలా వరకు వెనక్కి నెట్టాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ తనను తానే కాకుండా ప్రపంచాన్ని కూడా రక్షిస్తోందన్నారు. 

కాగా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడుల వల్ల ఇప్పటి వరకు 230 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‎కు భారీ నష్టం వాటిళ్లింది. ఆ దేశానికి ఆర్మీ అగ్రనేతలు, న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. ఇరాన్ లోని చమురు మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం భీకరంగా మారుతుండటంతో సంయమనం పాటించాలని ప్రపంచదేశాలు కోరుతున్నా.. టెల్ అవీవ్, టెహ్రాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పోటాపోటీగా దాడులు చేసుకుంటున్నారు. దీంతో ప్రపంచదేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.