సాంబారుకు కక్కుర్తి పడిన హోటల్.. రూ.3 వేల 500 ఫైన్

సాంబారుకు కక్కుర్తి పడిన హోటల్.. రూ.3 వేల 500 ఫైన్

బిహార్ బక్సర్‌లోని దక్షిణ భారత వంటకాలను అందించే ఓ రెస్టారెంట్.. దోసతో సాంబార్‌ను అందించకపోవడంతో ఇబ్బందుల్లో పడింది. రూ.140 ధర కలిగి ఉన్న 'స్పెషల్ మసాలా దోస'తో పాటు సాంబార్‌ను అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.3వేల5వందల జరిమానా పడింది.

ఒక కస్టమర్.. 'స్పెషల్ మసాలా దోస'తో పాటు పప్పు, కూరగాయలు, మసాలా దినుసులు ఉపయోగించి తయారుచేసిన సాంబార్ అందించకపోవడంతో, రెస్టారెంట్‌ను వినియోగదారుల కోర్టుకు లాగారు. సాంబార్ నిరాకరించడం వల్ల "మానసిక, శారీరక, ఆర్థిక" బాధలు కలుగుతున్నాయని పిటిషినర్ వినియోగదారుల న్యాయస్థానంలో వాదించాడు.

ఈ సంఘటన ఆగష్టు 15, 2022న జరిగింది. మనీష్ గుప్తా తన పుట్టినరోజున నమక్ రెస్టారెంట్ లో 'స్పెషల్ మసాలా దోస'ను తినాలని వెళ్లాడు. రెస్టారెంట్‌కి వచ్చిన అతను రూ.140 విలువైన టేక్‌అవే డిష్‌ను ఆర్డర్ చేశాడు. ఇంటికి చేరుకోగానే, దోసతో పాటు సాంబారు లేకపోవడంతో అతను నిరాశకు గురయ్యాడు. కోపోద్రిక్తుడైన గుప్తా.. రెస్టారెంట్‌కి వెళ్లి మిస్సయిన సాంబార్ గురించి అడిగాడు. గుప్తా ఫిర్యాదును రెస్టారెంట్ యజమాని సీరియస్‌గా తీసుకోలేదు. బదులుగా "రూ. 140కి మొత్తం రెస్టారెంట్ కొనాలనుకుంటున్నారా?" అని రెస్టారెంట్ యజమాని వెక్కిరించాడు.

ఈ క్రమంలో మనస్తాపానికి గురైన ఆ న్యాయవాది.. రెస్టారెంట్‌కు లీగల్ నోటీసును పంపించారు. రెస్టారెంట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 11 నెలల తర్వాత, వినియోగదారుల కమిషన్ ఛైర్మన్ వేద్ ప్రకాష్ సింగ్, వరుణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. పిటిషనర్ మనీష్ గుప్తాకు "మానసిక, శారీరక, ఆర్థిక" బాధలను గుర్తించి, రెస్టారెంట్‌ను దోషిగా నిర్ధారించింది.

రెస్టారెంట్‌కు రూ.3వేల5వందల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జరిమానా రెండు భాగాలుగా విధించారు. రూ. 15వందల వ్యాజ్యం ఖర్చు, రూ. 2వేలు ప్రాథమిక జరిమానా అని కోర్టు వెల్లడించింది. జరిమానా చెల్లించేందుకు నమక్ రెస్టారెంట్‌కు 45 రోజుల గడువు ఇచ్చింది. సకాలంలో చెల్లించకపోతే, జరిమానా మొత్తంపై రెస్టారెంట్ 8% వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది.