వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

కూసుమంచి, వెలుగు:  వేర్వేరు చోట్ల  బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు.  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు  బైక్ పై నుంచి పడి  వడ్త్యి  హరి(19)  మృతిచెందగా, వడ్త్యి మల్సూర్​కు తీవ్ర గాయాలయ్యాయి.   వివరాలిలా ఉన్నాయి.. గంగాబండతండాకు చెందిన వడ్త్యి హరి, వడ్త్యి మల్సూర్​ మంగళవారం తండా నుంచి బైక్​పై  నేలకొండపల్లి  వైపు వెళ్తుండగా పొద్దున10.30 గంటల టైంలో  మల్లేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. 

ఇద్దరూ రోడ్డు పక్క చెట్ల పొదల్లో పడిపోయారు.  దీంతో వారు రాత్రంతా అక్కడే ఉన్నారు. బుధవారం పొద్దున ఓ పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ రమేశ్​ కుమార్​ ఘటనా స్థలానికి వెళ్లారు. స్పాట్​లోనే హరి మృతి చెందగా మల్సూర్​కు  తీవ్ర గాయాలయ్యాయి.  మల్సూర్​ను వెంటనే  పోలీసు కారులో హాస్పిటల్​కు తరలించి ప్రాణాలు కాపాడారు.   

శ్రీశ్రీ సర్కిల్​లో యువతి..

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు:  ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్​లో  స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక యువతి చనిపోగా , మరో యువతి తీవ్రంగా గాయపడింది.   వైరా హెచ్​పీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీకన్య, నూనవత్​ రాణి స్కూటీపై ఖమ్మం నుంచి వైరా వెళ్తున్న క్రమంలో శ్రీశ్రీ సర్కిల్​ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో శ్రీకన్య అక్కడికక్కడే మృతిచెందింది. రాణికి గాయాలవడంతో హాస్పిటల్​కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని ఢీకొట్టిన లారీ అతివేగంగా వెళ్తూ టేకులపల్లి బ్రిడ్జి వద్ద ఓ కారును కూడా ఢీకొట్టింది.

ఆటో, బైక్​ ఢీకొని ఒకరు..

పాల్వంచ రూరల్, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఆటో, బైక్​ ఢీకొన్న ఘటనలో బుధవారం ఓ వ్యక్తి చనిపోయాడు. పాల్వంచ రూరల్​ ఎస్​ఐ కార్తీక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామానికి చెందిన కాలం నర్సింహారావు(40), తన బైక్​పై చింతగుంపు వెళ్తుండగా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో నర్సింహారావు బైక్​ను బలంగా ఢీకొంది. ఈప్రమాదంలో నర్సింహారావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య పున్నమ్మ, పిల్లలు ఉన్నారు.