‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ యాత్రలో బాబుమోహన్
గూడూరు, వెలుగు: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్ జోస్యం చెప్పారు. ‘ప్రజా గోస..బీజేపీ భరోసా’లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురంలో బాబుమోహన్ పర్యటించారు. మండలంలో రెండు రోజుల పాటు సాగే యాత్ర మొదటి రోజు గురువారం చిన్నఎల్లాపురం, సీతానగరం, భూపతిపేటలో కొనసాగింది. ఈ సందర్భంగా బాబూమోహన్మాట్లాడుతూ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలకు సొమ్ము కేంద్రానిది.. సోకు మాత్రం కేసీఆర్ప్రభుత్వానిది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు దోచుకునుడు, దాచుకునుడు మీద ఉన్న ప్రేమ ప్రజలపై లేదన్నారు. ఈ సందర్భంగా భూపతిపేట శివారు పాల్త్యా తండాకు చెందిన 150మంది టీఆర్ఎస్నుంచి బీజేపీలో చేరారు. యాత్రలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, జిల్లా అధ్యక్షుడు రాంచంద్రారావు, మండల అద్యక్షుడు మోతీలాల్, అశోక్ రెడ్డి, వెంకన్న, సుధాకర్, సురేందర్, భాస్కర్, నాగరాజు, శ్రీశైలం, మల్లేశ్, కాంతమ్మ, కొమురయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
ములుగు, వెలుగు : కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. గురువారం ములుగులో జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి అధ్యక్షతన గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గ్రామాల్లో తిరుగుతూ పోరాటాలు చేయాలన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్యకర్తలు స్పందించాలని సూచించారు. గ్రామ, మండల, బ్లాక్ కాంగ్రెస్ ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ పటిష్ఠతకు కృషిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పోకడలతో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి బాగ్ వాన్ రెడ్డి, వెంకన్న, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, సూర్యనారాయణ, జయరాంరెడ్డి, రఘు, అఫ్సర్ పాషా, అనంత రెడ్డి, సారయ్య, వెంకటేశ్వర్లు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు చంద్ర మౌళి, శ్రీనివాస్, సీతారాంనాయక్, మొగిలి పాల్గొన్నారు.
సీఐ కుటుంబానికి రూ.25లక్షల చెక్కు అందజేత
వరంగల్/ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న వై.రమేశ్బాబు (55) అనారోగ్యంతో మంగళవారం చనిపోయారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చిన్నబీరవెల్లికి చెందిన రమేశ్బాబు 1996 ఎస్ఐ బ్యాచ్లో పోలీసు శాఖలో చేరారు. కొన్నాళ్లుగా జీర్ణాశయ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హస్పిటల్లో మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. ఈ క్రమంలో 1996 బ్యాచ్ కు చెందిన ఉమ్మడి రాష్ట్రంలోని సీఐలు, డీఎస్పీలు గురువారం రమేశ్బాబు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. సీఐ కుటుంబానికి రూ.25,00,116 చెక్కును అందజేశారు.
రామప్పలో ముగింపు వేడుకలు
వెంకటాపూర్ (రామప్ప) వెలుగు: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం ‘రామప్ప వైభవం’ పేరుతో ఈనెల 18న రామప్ప టెంపుల్ లో ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.కృష్ణ చెప్పారు. గురువారం రామప్ప టెంపుల్ లో ముగింపు కార్యక్రమ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై తహసీల్దార్మంజులకు పలు సూచనలు చేశారు. 18న నిర్వహించే కల్చరల్ప్రొగ్రామ్లో సినిమా నటులు తనికెళ్ల భరణి, శివమణి, సంగీత వాయిద్య కళాకారులు పాల్గొంటారని తెలిపారు.
రామప్ప విశిష్టతను చాటిచెప్పేందుకు వాలంటీర్లకు ట్రైనింగ్
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప విశిష్టతను ప్రపంచానికి తెలియజేసేందుకు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 1 వరకు వలంటీర్లకు స్పెషల్ట్రైనింగ్ ఇస్తున్నట్లు కలెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఈ ప్రొగ్రాంలో వివిధ దేశాలకు చెందిన వాలంటీర్లు పాల్గొంటారన్నారు.
ములుగులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
వెంకటాపూర్( రామప్ప), వెలుగు: వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పోరిక గోవిందనాయక్తెలిపారు. వెంకటాపూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలో మండలాధ్యక్షుడు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి గోవిందనాయక్ చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక దృష్టి ఉందని, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలిచి ఆయనకు బహుమతిగా ఇస్తామన్నారు. కాంగ్రెస్నాయకులు ఇన్నాళ్లుగా ములుగు ప్రాంత ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఎంపీటీసీ మహిపాల్ రెడ్డి, సర్పంచులు మొండయ్య, రవి ,కుమారస్వామి, జగ్గారం, జగన్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ రమేశ్ , టీఆర్ఎస్లీడర్లు పోశాలు, సీతారామరాజు పాల్గొన్నారు.
దర్గా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: ఈనెల 23, 24, 25 తేదీల్లో కాజీపేట దర్గాలో మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ లో కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, దర్గా పీఠాధిపతి ఖుస్రుపాషాలతో కలిసి దర్గా ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాజీపేట దర్గా ఉత్సవాలకు సుమారు 50వేలమంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జి.సంధ్యారాణి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ పాల్గొన్నారు.
నిరుపేదలకు వరం ఆసరా పింఛన్లు
ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, వెలుగు: నిరుపేదలకు ఆసరా పింఛన్లు వరమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ చెప్పారు. గురువారం జడ్పీ చైర్మన్ డా.మారెపల్లి సుధీర్ కుమార్ తో కలిసి ఎల్కతుర్తి, భీమదేవరపల్లిల్లో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎల్కతుర్తి మండలంలో 5,340 మందికి ఆసరా పింఛన్లు అందేవని, ప్రస్తుతం అదనంగా 1241 మందికి మంజూరయ్యాయన్నారు. అనంతరం 63 మందికి కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, 21 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గోపాల్ పూర్ పెద్ద చెరువులో 55 వేల చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో ఎంపీపీలు స్వప్న , అనిత , వైఎస్ ఎంపీపీలు ఎజ్రా, నగేశ్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రామారావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ లు నిరంజన్ రెడ్డి, కొమురయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సమ్మయ్య గౌడ్, ఇతర లీడర్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ది మరో నిజాం పాలన
భూపాలపల్లిలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
భూపాలపల్లి అర్బన్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలన ఇంకా టీఆర్ఎస్ప్రభుత్వ రూపంలో కొనసాగుతోందని, సీఎం కేసీఆర్ మరో నిజాంలా పాలన సాగిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి అన్నారు. గురువారం భూపాలపల్లిలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లవుతున్నా విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో పట్టణ మహిళామోర్చా అధ్యక్షురాలు కడారి మాలతి, ప్రధాన కార్యదర్శి పద్మ, లీడర్లు సునీత, భాగ్య, రేణుక, జె.పద్మ, కవిత, రజిత, లక్ష్మీ, హైమావతి, ప్రమీల, వసంత, వెన్నెల,స్నేహ,
ఆశా పాల్గొన్నారు.
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
పాలుకుర్తి, వెలుగు: తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా నేడు పాలకుర్తిలో 30 వేల మందితో నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో కలిసి స్థభాస్థలిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాసరావు, సర్పంచ్ యాకాంతారావు, జడ్పీ కో ఆప్షన్ మెం బర్ ఎండీ మధార్, బాలునాయక్ పాల్గొన్నారు.
స్టూడెంట్స్ భవితకు ‘తొలిమెట్టు’
నెక్కొండ, వెలుగు: స్టూడెంట్స్లో చదవడం, రాయడంతోపాటు సామర్థ్యాలను పెంపొందించేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని ప్రొగ్రాం జిల్లా అబ్జర్వర్కుమారస్వామి, నోడల్ఆఫీసర్ సుజన్తేజ అన్నారు. గురువారం నెక్కొండలోని ఎంఈవో ఆఫీసులో తొలిమెట్టు కార్యక్రమంపై మీటింగ్ జరిగింది. ఈసందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ స్టూడెంట్స్కు క్లాస్రూం సామర్థ్యాలతో పాటు చతుర్విద ప్రక్రియలు సాధించేలా తొలిమెట్టును సక్సెస్చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో రత్నమాల, ఆర్పీ యాకుబ్రెడ్డి, స్కూల్కాంప్లెక్స్ టీచర్లు పాల్గొన్నారు.
అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ
చిట్యాల, వెలుగు: చిట్యాల మండలకేంద్రంలోని మోడల్స్కూల్లో స్టూడెంట్స్కు గురువారం నులి పురుగుల నివారణలో భాగంగా అల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. ఎంపీపీ వినోద, జడ్పీటీసీ సాగర్, ఎంపీడీఓ రామయ్యలు పాల్గొని స్టూడెంట్స్కు టాబ్లెట్స్వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రజిత, ఎంపీటీసీ పద్మ, పీహెచ్సీ డాక్టర్ నాగరాణి, పాల్గొన్నారు.
మహాముత్తారం, వెలుగు: మహాముత్తారంలోని కేజీబీవీలో స్టూడెంట్స్కు నులిపురుగుల నివారణలో భాగంగా పీహెచ్సీ డాక్టర్గోపీనాథ్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ లింగమల్ల శారద అల్బెండజోల్ టాబ్లెట్లు వేశారు. ప్రతి ఏటా ఆరునెలలకోసారి ఆల్బెండజోల్ టాబ్లెట్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్రమాదేవి, ఆయుర్వేదిక్ డాక్టర్ అరుణ పాల్గొన్నారు.
ఆన్లైన్లో రూ.4లక్షల మోసం
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన ముంజాల మధుకృష్ణ ఆన్లైన్లో రూ.4లక్షలు మోసపోయాడు. జూన్16న ఓ లింక్ ద్వారా అతని బ్యాంకు అకౌంట్కు రూ.8వేలు వచ్చాయి. ఐదు రోజుల తర్వాత ఆ డబ్బు రిటర్న్ పంపించాలని లేకపోతే నీ న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి కాంటాక్ట్ లిస్టులో పెడతామని హ్యాకర్లు బెదిరించడంతో పలు దఫాలుగా సుమారు రూ.4లక్షల వరకు చెల్లించాడు. మధుకృష్ణ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.
మద్యం మత్తులో తమ్ముడిని కొట్టి చంపిన అన్న
ఏటూరునాగారం, వెలుగు: మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవలో తమ్ముడు చనిపోయాడు. మంగపేట ఎస్సై తాహెర్బాబా వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన మునుకుంట్ల సంపత్, మునుకుంట్ల శేఖర్ అన్నదమ్ములు. బుధవారం రాత్రి మద్యం మత్తులో వీరిద్దరూ గొడవ పడ్డారు. అన్న సంపత్ ఎడ్లబండి కనెంతో తమ్ముడైన శేఖర్(30) తలపై బలంగా కొట్టాడు. దీంతో శేఖర్అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సంపత్పై కేసు నమోదు చేశారు. సంపత్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.