- రామకృష్ణాపూర్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఆందోళన
రామకృష్ణాపూర్, వెలుగు: రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ల విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం కోసం శిలాఫలకాలు వేసి నాలుగేళ్లు గడిచినా పనులు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్ మొయిన్ గేటు ఎదుట బీజేపీ, దాని అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ విప్బాల్క సుమన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాకు ఎలాంటి పర్మిషన్ లేదంటూ లీడర్లు, కార్యకర్తలను రామకృష్ణాపూర్ ఎస్సై అశోక్, పోలీసులు బలవంతంగా తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్యలపై శాంతియుతంగా ధర్నాకు దిగితే పోలీసులు అడ్డుకోవడం ఏంటని, ప్రభుత్వ విప్ కనుసన్నల్లో పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణకు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా బీజేపీ టౌన్ప్రెసిడెంట్మహంకాళీ శ్రీనివాస్, బీసీ మోర్చా ప్రెసిడెంట్వీరమల్ల పాల రాజయ్య మాట్లాడుతూ.. రామకృష్ణాపూర్మున్సిపాలిటీ పరిధిలో మెయిన్ రోడ్ల విస్తరణ, కొత్తగా నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల కోసం బాల్క సుమన్ 22 చోట్ల నాలుగేళ్ల కిందట శిలాఫలకాలు వేశాడన్నారు. ఇప్పటివరకు నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు. ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా పట్టణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న బాల్క సుమన్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ బై ఎలక్షన్లు వస్తే అక్కడ సమస్యలు పరిష్కారిస్తామంటూ ప్రచారం చేస్తూ సొంత నియోజకవర్గం చెన్నూరును మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్లు జంగపెల్లి మల్లయ్య, సంగ రవి, జనరల్ సెక్రటరీ వేల్పుల సత్యనారాయణ, సీనియర్ లీడర్ అరిగెల రవీందర్, మహిళా మోర్చా ప్రెసిడెంట్ మేదరి లక్ష్మి, ఎస్సీ, కిసాన్ మోర్చా ప్రెసిడెంట్లు బంగారి ప్రసాద్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.