సీఎం అయ్యింది.. గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా.?

సీఎం అయ్యింది.. గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా.?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది గిరిజనుల బతుకుల్లో మట్టి కొట్టడానికా అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానన్న సీఎం హామీ ఏమైందని నిలదీశారు. 2005లో పార్లమెంట్ లో అప్పటి కేంద్రప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాలు కల్పించే చట్టం ప్రవేశపెట్టిందని..2006లో దీనికి పార్లమెంట్ ఆమోదం తెలిపిందన్నారు. 2014 వరకే 93,494 కుటుంబాలకు 3లక్షల 92 ఎకరాలకు హక్కు పత్రాలు కూడా ఇచ్చారని చెప్పారు. భూమి పుత్రులుగా జీవించే గిరిజనులకు అప్పటి ప్రభుత్వం హక్కు పత్రాలు ఇచ్చిందన్నారు.

గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం వుందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారని ఈటల తెలిపారు. అసెంబ్లీలో జులై 19, 2019, అక్టోబర్ 1 2021, మార్చి 15 2022 న పోడు భూములపై కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. ‘‘పోడు భూముల వ్యవహరాన్ని తేలుస్తా. నేనే బయలుదేరుతా..అన్ని జిల్లాలకు పోదాం. నేనే కాదు మంత్రులు, అధికారుల్ని తీసుకొస్తా. వాళ్ల ముందే ప్రజాదర్బార్ పెట్టి ఇది పోడు భూమి..ఇది పట్టా అని తేల్చేస్తాం. ఇంచు భూమి కూడా అన్యక్రాంతం కానివ్వం. వారికి  రైతు బీమా, రైతు బంధు ఇస్తాం’’ అంటూ కేసీఆర్ ప్రకటించారని ఈటల చెప్పారు. 
 
టీఆర్ఎస్ 2014, 2018 మ్యానిఫెస్టోలలో అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదం పరిష్కరించి యజమాన్య హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారని కానీ అది ఇప్పటివరకు అమలుకాలేదని విమర్శించారు. కేసీఆర్ భూములు గుంజుకుని అమ్ముకునే బ్రోకర్ పని చేస్తుండని ఈటల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గిరిజనులపై దుర్మార్గమైన రీతిలో దాడులు చేస్తున్నారని..దీనిని వెంటనే ఆపాలన్నారు. గిరిజనుల జోలికి వెళ్తే చూస్తూ ఊరుకోమని ఈటల స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. గిరిజన బిడ్డను బీజేపీ దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేస్తే..రాష్ట్రంలో మాత్రం గిరిజనులపై దాడులు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు.