- లేదంటే బీజేపీ కార్యకర్తలు ఆ టవర్ కూల్చేస్తరు: రాజాసింగ్
హైదరాబాద్, వెలుగు: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరుతో ఏపీలోని గుంటూరులో టవర్ ఉండటం ఏమిటని.. దాన్ని జిన్నా సర్కిల్గా ఎట్లా పిలుస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. దాని పేరును వెంటనే అబ్దుల్ కలాం టవర్గా మార్చాలని ఏపీ సర్కార్ కు సూచించారు. లేదంటే దాన్ని కూల్చివేయాలని అక్కడి బీజేపీ నాయకులు, కార్యకర్తలను గురువారం ఒక ప్రకటనలో కోరారు. ‘‘కరోనా కేసులు పెరుగుతుండటంతో చాలా రాష్ట్రాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు అనేక రూల్స్పెట్టాయి. కానీ మన సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని ఆరోపించారు. నాంపల్లి ఎగ్జిబిషన్కు లక్షల మంది వస్తారని, దీంతో కరోనా పెరిగే ప్రమాదం ఉందని.. ఎగ్జిబిషన్ నిర్వహణను ఉపసంహరించుకోవాలని సీఎంను కోరారు. వివిధ రాష్ట్రాల టూరిస్టులు ఇక్కడికి వస్తున్నందున హిందీలో కూడా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.