హైదరాబాద్: రాష్ట్రానికి రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దాని ప్రకారం... బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో రేపు నడ్డా పాల్గొననున్నారు. యాత్రలో భాగంగా ‘ప్రజా గోస–బీజేపీ భరోసా’ పేరుతో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభను నిర్వహించనుంది. జేపీ నడ్డా ఈ సభలో పాల్గొంటారని బీజేపీ ప్రకటించింది. అందుకోసం... రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. వారితో ప్రజా సంగ్రామ యాత్ర జరుగుతున్న తీరు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సాయంత్రం 5 గంటలకు స్థానిక రైల్వే గెస్ట్ హౌజ్ కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎంవీఎస్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
మరిన్ని వార్తల కోసం...