న్యూఢిల్లీ : ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ కమర్షియల్ , లీజింగ్ వ్యాపారాలను రూ. 4,420 కోట్లకు బ్లాక్స్టోన్ గ్రూప్ ఎల్ఎల్పీ కొననుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం అప్పులు తీర్చేసి, డెట్ ఫ్రీ కంపెనీగా మారాలనేది ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ టార్గెట్. ఈ నేపథ్యంలో ఇండియాబుల్స్ ప్రోపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లలో తనకున్న వాటాని మరో భాగస్వామైన బ్లాక్స్టోన్కు ఇచ్చేయనుంది. ఈ కంపెనీల కింద ముంబైలోని లోయర్ పరేల్లో కమర్షియల్ అసెట్స్ ఉన్నాయి. గురుగ్రామ్లోని ఉద్యోగ్ విహార్ వద్ద కమర్షియల్ అసెట్స్ ఉన్న యాషితా బిల్డ్కాన్ లిమిటెడ్, అష్కిత్ ప్రోపర్టీస్ లిమిటెడ్లనూ అమ్మేయనుంది. ముంబైలోని ఓర్లి వద్ద కమర్షియల్ అసెట్స్, న్యూఢిల్లీలోని కే జీ మార్గ్, గురుగ్రామ్లోని సెక్టార్ 104–106 వద్ద ఉన్న అసెట్స్లో హక్కులను లేదా వాటాను కూడా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ అమ్మేస్తోంది. ముంబై, గురుగ్రామ్ ప్రాజెక్టులలో గతంలోనే బ్లాక్స్టోన్ 50 శాతం వాటా తీసుకుంది. తాజా నిర్ణయంతో ఈ అసెట్స్లో బ్లాక్స్టోన్కు నూరు శాతం వాటా చేతికి వస్తుంది. త్వరలోనే ఈ అమ్మకం కార్యరూపంలోకి వస్తుందని ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపింది. కొన్ని రెగ్యులేటరీ అనుమతులతోపాటు, సంబంధిత ఒప్పందాలను కుదుర్చుకోవల్సి ఉంటుందని పేర్కొంది. మార్చి 2020 నాటికి అప్పులు లేని కంపెనీగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ ఏడాది ఆగస్టులోనే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ వెల్లడించింది. ఇందుకోసం వివిధ ఆస్తులు, కంపెనీలలో ఉన్న వాటాలను థర్డ్–పార్టీకి లేదా ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు వాటిని అమ్మేయాలనుకుంటున్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా లండన్లో కంపెనీకి ఉన్న ప్రోపర్టీని 20 కోట్ల పౌండ్లకు ఇండియాబుల్స్ విక్రయించనుంది. మార్చి 2019 నాటికి ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ అప్పులు రూ. 4,420 కోట్లు.
కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లే ఇండియాబుల్స్ చేతిలో….
ఈ వాటాల అమ్మకం తర్వాత కొన్ని రెసిడెన్షియల్ ప్రాజెక్టులు మాత్రమే ఇండియాబుల్స్ చేతిలో మిగులుతాయని సీఎల్ఎస్ఏ రిపోర్టు పేర్కొంది. అందులో సెంట్రల్ ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (గురుగ్రామ్) ప్రాజెక్టులుంటాయని తెలిపింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్తో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ విలీనం కావాలనుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ విలీనానికి ఆర్బీఐ నిబంధనలు నెరవేర్చేందుకే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్లో వాటా అమ్మేయాలని ప్రమోటర్లు నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్లోనే బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రోపర్టీ డెవలప్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్లాక్ డీల్ ద్వారా ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్లో 13.9 శాతం వాటా కొంది. ఫలితంగా ప్రమోటర్ల వాటా 23.38 శాతానికి తగ్గిపోయింది. వాటా అమ్మకం ప్రకటన నేపథ్యంలో అంతకు ముందు రెండు రోజులుగా నష్టాలపాలవుతున్న ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ షేర్లు బుధవారం 3.3 శాతం పెరిగి రూ. 66.40 వద్ద ట్రేడయ్యాయి.