
నెట్వర్క్, వెలుగు: సిటీ శివారులోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఆషాఢ మాసంలో వచ్చే గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ బోనాల తర్వాత శివారుల్లో శ్రావణ మాస బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. బోడుప్పల్ పరిధిలోని ఆలయాలన్నీ ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. బంగారు మైసమ్మ ఆలయంతో పాటు పోచమ్మ, ఎల్లమ్మ, నల్లపోచమ్మ ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు.
బంగారు మైసమ్మ ఆలయంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ పూజలు చేశారు. నాగోల్ బండ్లగూడలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అలాగే బోయిగూడ శ్రీనల్లపోచమ్మ ఆలయంలో అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించారు.