మెల్బోర్న్: ఇండియా వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్డబుల్స్ టైటిల్ను గెలిచాడు. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ బోపన్న–మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) 7–6 (7/0), 7–5తో సిమోన్ బొలెల్లి–ఆండ్రియా వావసోరి (ఇటలీ)పై గెలిచారు. ఓవరాల్గా ఇండియా తరఫున మెన్స్ డబుల్స్ గ్రాండ్స్లామ్ నెగ్గిన మూడో ప్లేయర్గా బోపన్న రికార్డులకెక్కాడు. లియాండర్ పేస్, మహేశ్ భూపతి ముందుండగా, విమెన్స్లో హైదరాబాదీ సానియా మీర్జా గ్రాండ్స్లామ్ ఘనతను సాధించింది. బోపన్న కెరీర్లో ఇది రెండో గ్రాండ్స్లామ్ కావడం విశేషం. 2017లో గాబ్రియోలా డబ్రౌస్కీతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ టైటిల్ను గెలిచాడు.
ఇక మెన్స్ టెన్నిస్లో 43 ఏళ్ల వయసులో గ్రాండ్స్లామ్ నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్గానూ బోపన్న రికార్డులకెక్కాడు. ఫలితంగా జీన్ జూలియన్ రోజెర్ (40 ఏళ్లు) రికార్డును బ్రేక్ చేశాడు. 2022లో మార్సెలో అరెవోలాతో కలిసి రోజెర్ ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను సాధించాడు. గంటా 39 నిమిషాల మ్యాచ్లో బోపన్న జోడీకి.. ఇటాలియన్ జంట గట్టి పోటీ ఇచ్చింది. తొలి సెట్లో బోపన్న కొట్టిన రెండు బ్రేక్ పాయింట్లను కాచుకుని మ్యాచ్లో నిలిచింది. అయితే టైబ్రేక్లో బొలెల్లి–వావసోరి నిరాశపర్చారు. రెండో సెట్ 11వ గేమ్లో ఎబ్డెన్ సర్వీస్కు బొలెల్లి గట్టిపోటీ ఇచ్చాడు. కానీ డ్యూస్లో బలమైన ఏస్ కొట్టి ఇండో–ఆసీస్ జోడీ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో 8 ఏస్లు కొట్టిన బోపన్న ద్వయం మూడు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్నే కాచుకుంది.