న్యూఢిల్లీ: మోసపూరిత అకౌంట్లుగా లోన్ అకౌంట్లను ప్రకటించే ముందు బ్యాంకులు కచ్చితంగా ఎగవేతదారుల అభిప్రాయం తెలుసుకోవల్సిందేనని సుప్రీం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా బారోవర్లకు అవకాశం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. బ్యాంకులు ఒకసారి లోన్ అకౌంట్ను మోసపూరిత అకౌంట్గా ప్రకటిస్తే, బారోవర్ సివిల్, క్రిమినల్ పరమైన అనేక చర్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. మరో రకంగా చెప్పాలంటే బారోవర్కు మరెక్కడా అప్పు పుట్టకుండా బ్లాక్లిస్ట్ చేసినట్లే అవుతుంది.
కాబట్టి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్పై రిలీజ్ చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ప్రకారం బారోవర్లకు తమ అభిప్రాయం చెప్పుకునేలా ఒక అవకాశం ఇవ్వాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వక ఎగవేత అకౌంట్లను మోసపూరిత అకౌంట్లుగా ప్రకటించే వీలు బ్యాంకులకు కల్పిస్తూ ఆర్బీఐ 2016 లో ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ సర్క్యులర్పై వివిధ హై కోర్టులలో కేసులు కూడా దాఖలయ్యాయి. అయితే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేముందుగానే బారోవర్కు తన అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు పేర్కొంది.
బ్యాంకులకు ఇబ్బందే...
సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రికవరీలకు అడ్డుపడుతుందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. రికవరీ ప్రాసెస్ చాలా ఆలస్యం అయ్యేందుకు ఈ తీర్పు వీలు కలిగిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో బ్యాంకులకు ఇబ్బందులపాలవుతాయని వివరిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆర్డరుతో బ్యాంకులు పాటించాల్సిన ప్రాసెస్లు ఎక్కువవుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మాజీ ఛైర్మన్ రజ్నీష్ కుమార్ చెప్పారు. కేసులలో మరింత జాప్యం పెరిగితే బ్యాంకులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని బ్యాంకింగ్ ఎక్స్పర్ట్ నరేష్ మల్హోత్రా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల లీగల్, లిటిగేషన్ ఖర్చుల రూపంలో బ్యాంకులపై అదనపు భారం పడకతప్పదని ఎకనమిక్ లా ప్రాక్టీస్ సంస్థ సీనియర్ కౌన్సెల్ ముకేష్ చంద్ చెప్పారు.
