
బిజినెస్ డెస్క్, వెలుగు: వరసగా ఎనిమిది సెషన్ల నుంచి పెరుగుతూ వస్తున్న నిఫ్టీకి శుక్రవారం బ్రేక్ పడింది. ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 17,992 వరకు వెళ్లిన నిఫ్టీ, 18,000 లెవెల్ను టచ్ చేయకుండానే వెనుదిరిగింది. సెన్సెక్స్ శుక్రవారం సెషన్లో 652 పాయింట్లు నష్టపోయి 59,646 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 198 పాయింట్లు తగ్గి 17,758 వద్ద ముగిసింది.
సెన్సెక్స్లోని 30 షేర్లలో 27 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్, ఆటో, రియల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు శుక్రవారం 1–2 శాతం మేర పతనమయ్యాయి. బీఎస్ఈలోని కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.94 లక్షల కోట్లు తగ్గి రూ. 280.52 లక్షల కోట్లు నుంచి రూ. 277.58 లక్షల కోట్లకు పడింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు కూడా ఒక శాతం చొప్పున నష్టపోయాయి.
‘డాలర్ ఇండెక్స్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు సడెన్గా నికర కొనుగోలుదారులుగా మారడంతో బుల్స్కు షాక్ తగిలింది. మార్కెట్ మొత్తం నెగెటివ్లోనే ట్రేడయ్యింది. హెవీవెయిట్ షేర్లు ఇండెక్స్లను కిందకి లాగాయి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. అయినప్పటికీ, బెంచ్మార్క్ ఇండెక్స్లు వరసగా ఐదో వారాన్ని కూడా లాభాల్లో ముగించాయని చెప్పారు.
మార్కెట్ పతనానికి కారణాలు..
1) రిలయన్స్, బ్యాంక్ షేర్ల పతనం..
ప్రభుత్వం డీజిల్, జెట్ఫ్యూయల్ ఎగుమతులపై విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ను పెంచడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు శుక్రవారం 2 శాతం పతనమైంది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు కూడా పడడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు భారీగా నష్టపోయాయి. బ్యాంక్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ 3.5 శాతం పడగా, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు 2.4 శాతం వరకు నష్టపోయాయి. ఫైనాన్షియల్ షేర్లయిన బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్లు కూడా శుక్రవారం 2 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇండెక్స్లను కిందకి లాగాయి.
2) డాలర్ పైకి..
ఆరు మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ శుక్రవారం బలపడింది. డాలర్ ఇండెక్స్ నెల గరిష్టానికి చేరుకుంది. డాలర్ బలపడడంతో రూపాయి విలువ శుక్రవారం 20 పైసలు తగ్గి 79.84 వద్ద సెటిలయ్యింది. సాధారణంగా డాలర్ వాల్యూ పెరిగితే స్టాక్ మార్కెట్లు పడతాయి.
3) అమ్మకందారులుగా ఎఫ్ఐఐలు..
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) తాజాగా నికర అమ్మకందారులుగా మారారు. గురువారం సెషన్లో నికరంగా రూ. 1,706 కోట్ల విలువైన షేర్లను వీరు సెల్ చేశారు.
4) టెక్నికల్గా..
నిఫ్టీ వరసగా ఎనిమిది సెషన్లలో లాభపడి ఓవర్ బాట్ (ఎక్కువగా కొనడం) రీజియన్లోకి వెళ్లిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఆర్ఎస్ఐ, ఆర్వీఐ వంటి ఇండికేటర్లు బెంచ్మార్క్ ఇండెక్స్లు ఓవర్బాట్ రీజియన్లో ఉన్నాయనే సంకేతాలను ఇస్తున్నాయి. అంతేకాకుండా గత రెండు సెషన్లలోనూ డైలీ చార్ట్లో చిన్న బుల్ క్యాండిల్స్ ఏర్పడ్డాయి. దీనర్ధం బుల్స్ స్పీడ్ తగ్గిందని. నిఫ్టీ 18,000 లెవెల్కు దగ్గరలో ఉన్నప్పుడు అమ్మకాల ఒత్తిడి నెలకొందని ఎనలిస్టులు వివరించారు.
5) ఇక్కడి నుంచి కష్టమే..
ఇండెక్స్లు ఈ ఏడాదిలో నష్టపోయిన మొత్తం గత నెలన్నరలోనే రికవరీ అయ్యిందని బ్రోకరేజి కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. పెరిగిన మార్కెట్ వాల్యుయేషన్ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు లేదని వివరించింది. షార్ట్టెర్మ్ స్ట్రాటజీగా కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలని, ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే అసెట్లలో కొంత ఇన్వెస్ట్ చేయాలని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ ఇన్వెస్టర్లకు సలహాయిచ్చారు.
నాణ్యమైన ఫైనాన్షియల్ షేర్లు, క్యాపిటల్ గూడ్స్,ఆటో సెక్టార్లోని టాప్ కంపెనీల షేర్లు పడితే మాత్రం కొనడం చేయాలని అన్నారు. మార్కెట్లు ఇక్కడి నుంచి పెరగడం గ్లోబల్, లోకల్ ఆర్థిక వ్యవస్థలు నిలకడగా కొనసాగడంపై ఆధారపడి ఉంటుందని, కంపెనీల రిజల్ట్స్ అంచనాలకు తగ్గట్టు ఉండడంపై ఆధారపడుతుందని వివరించారు.