బిజినెస్ డెస్క్, వెలుగు: డాలర్ విలువ ఆగకుండా పెరగడం చాలా దేశాలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆఫ్రికాలోని నైజీరియా వంటి దేశాలతోపాటు, ఆసియాలోని చైనా, ఇండియాలకూ చిక్కులు తప్పడం లేదు. డాలర్కు ఆల్టర్నేటివ్ తేవాలని చాలా కాలం నుంచి ప్రయత్నాలు సాగుతున్నా అవి సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో త్వరలో దక్షిణాఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో జరగనున్న బ్రిక్స్ దేశాల మీటింగ్ డాలర్ అధిపత్యానికి తెరదించడంపై ఫోకస్ పెట్టనుంది.
గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్లో అత్యంత బలమైనదిగా అమెరికా డాలర్ ఎదిగిపోయింది. పర్యవసానంగా ఎగుమతులు, దిగుమతులు, అప్పులలో వస్తున్న సమస్యలతో చాలా దేశాలు మరీ ముఖ్యంగా ఎమర్జింగ్ దేశాలు బాగా విసిగిపోయాయి. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలు త్వరలో సమావేశమవుతున్నాయి. గతంలో ఎన్నో సవాళ్లు ఎదురయినా తట్టుకుని నిలబడినా డాలర్ బ్రిక్స్ దేశాల తాజా సవాలును కూడా తట్టుకుంటుందా లేక తలొగ్గుతుందా అనేది ఆసక్తికరం.
అమెరికా వైఖరి నచ్చక..
తమ సొంత కరెన్సీ తేవాలని బ్రిక్స్ దేశాలు గత కొన్నేళ్ల నుంచి డిస్కస్ చేస్తున్నాయి. కానీ, అది కార్యరూపంలోకి వచ్చేలా చొరవ మాత్రం ప్రదర్శించలేదు. డాలర్ను పక్కకినెట్టి నేరుగా ఆయా దేశాల కరెన్సీలోనే బిజినెస్ చేయాలని ఎమర్జింగ్ దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీ తేవాలనే ఆయా దేశాల చొరవ మంగళవారం నుంచి జోహాన్స్బర్గ్లో జరిగే సమావేశంలోనైనా ఒక కొలిక్కి రావాలని ఆశిస్తున్నారు.
ఈ ఏడాది జూన్లో జరిగిన బ్రిక్స్ ఫారిన్ మినిస్టర్ల సమావేశంలో డాలర్కు ప్రత్యామ్నాయం కావాల్సిందేనని సౌత్ ఆఫ్రికా ప్రతినిధి నలేడి పండోర్ చెప్పారు. బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసుకున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ దిశలో పనిచేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్లో డాలర్కు చెక్ చెప్పాలని రష్యా, చైనాలు ఎప్పటి నుంచో కలలు కంటున్నాయి. ఆ దేశాల మంత్రులు ఇద్దరి పక్కన కూర్చుని సౌత్ ఆఫ్రికా మంత్రి పై వ్యాఖ్యలు చేశారు.
బ్రిక్స్ ఏర్పాటు 2009లో జరిగింది. మొదట్లో అది బ్రిక్ మాత్రమే. ఈ పదాన్ని గోల్డ్మన్ శాచ్స్ ఎకనమిస్ట్ జిమ్ఓ నీల్ కాయిన్ చేశారు. ఎదుగుతున్న దేశాలుగా పేరొందిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు అప్పట్లో ఆ జాబితాలో ఉండేవి. ఆ తర్వాత 2010 లో సౌత్ ఆఫ్రికా కూడా చేరడంతో చివరి ఎస్ అక్షరాన్ని చేర్చారు. దీంతో బ్రిక్స్గా మారింది. సౌదీ అరేబియా, ఇరాన్, వెనిజులా వంటి 20కి పైగా దేశాలు బ్రిక్స్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
2015 లో బ్రిక్స్ దేశాలన్నీ కలిసి న్యూ డెవలప్మెంట్ బ్యాంకును మొదలెట్టాయి. అమెరికా, యూరోపియన్ దేశాల నాయకత్వంలో నడిచే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), వరల్డ్ బ్యాంకులకి ఆల్టర్నేటివ్గా న్యూ డెవలప్మెంట్ బ్యాంకును తీసుకొచ్చాయి. బ్రిక్స్ దేశాలు. గ్లోబల్ఫైనాన్షియల్ సిస్టమ్లో డాలర్కి ఉన్న ఆధిపత్యాన్ని ఆసరాగా తీసుకుని ఏవైనా దేశాలపై ఆంక్షలు విధించడానికి దానిని అనువుగా మలుచుకుంటోంది అమెరికా.
ఈ అమెరికా వైఖరిపై చాలా దేశాలు తీవ్రమైన అసంతృప్తిని చూపిస్తున్నాయి. అంతేకాదు, డాలర్లోని హెచ్చు–తగ్గులు తమ దేశాల ఎకానమీలను తలకిందులు చేయగలవనే ఆందోళననూ వ్యక్తం చేస్తున్నాయి. డాలర్పై ఎక్కువగా ఆధారపడుతున్న విషయం మీద నైజీరియా, ఉగాండా, కెన్యా వంటి ఆఫ్రికా దేశాల అధినేతలు గత కొన్నేళ్లుగా విమర్శలను పెంచుతున్నారు. చైనా, అర్జెంటీనా దేశాలతో చేసే వ్యాపారానికి చెల్లింపులు డాలర్లలో ఎందుకు జరపాలని ఇటీవలే బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాషియో నులా డా సిల్వా గట్టిగా ప్రశ్నించారు.
బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కామన్ కరెన్సీ తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. గత కొన్నేళ్లలో చూస్తే అమెరికా డాలర్ అధిపత్యం గ్లోబల్ కామర్స్లో కొద్దిగా తగ్గుతూ వస్తోంది. యూరో, చైనా యువాన్లను డాలర్కు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. యూరో ఇప్పటికీ అమెరికా డాలర్కు గట్టి సవాలును విసరలేకపోతోంది.