పాట్నా: బిహార్ లో మరో బ్రిడ్జి కూలిపోయింది. గురువారం కిషన్ గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో బహదూర్ గంజ్, దిఘాల్ బ్యాంక్ బ్లాక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. బిహార్ లో పది రోజుల్లోనే బ్రిడ్జి కూలిపోవడం ఇది నాలుగో ఘటన.
కంకయీ, మహానంద నదులను కలిపే మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి నిర్మించారు. నేపాల్లోని పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఈ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి బ్రిడ్జి పిల్లర్లు కూలిపోయాయి’’ అని జిల్లా కలెక్టర్ తుషార్ సింగ్లా తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఇరువైపులా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. రోడ్ డిపార్ట్ మెంట్ అధికారులు కూడా ఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
