- లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే చాన్స్
- ఆ ఓట్లు తమవైపు మలుపుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు
- జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్
నెట్వర్క్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మళ్లుతాయన్న చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి మాత్రం భిన్నమైన తీర్పును ఇస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి.. ఆ మేరకు కాంగ్రెస్, బీజేపీ లాభపడడమే ఇందుకు నిదర్శనం. కాగా, గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో కేడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాఫ్పడిపోయింది. దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్లూ ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది.
భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓటు షేర్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 46 శాతం ఓట్లు సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి 5 శాతం ఓటు షేర్ కోల్పోయి 9 లోక్సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఏకంగా 37. 35కు పడిపోయింది. ఫలితంగా కేవలం 39 అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98 శాతం ఓట్లతో ఒక సీటును మాత్రమే గెలిచిన బీజేపీ.. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి తన ఓటింగ్ను 19.45 శాతానికి పెంచుకుని ఏకంగా 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 13. 90 శాతానికి పడిపోయినా.. 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక 2018 ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్.. 2019 లోక్సభ ఎన్నికల నాటికి ఒక శాతం ఓట్షేర్ పెంచుకొని 29. 48 శాతం ఓట్లతో మూడు లోక్సభ సీట్లను గెలుచుకుంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.40 శాతం ఓట్లు సాధించి ఏకంగా 64 సీట్లతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినప్పుడు బీఆర్ఎస్ ఓట్షేర్ 8.65 శాతం తగ్గగా, కాంగ్రెస్ ఓటుషేర్ మాత్రం సుమారు 11శాతం పెరిగింది. అంటే బీఆర్ఎస్ నుంచి దూరమైన ఓటర్లంతా గంపగుత్తగా కాంగ్రెస్వైపు మొగ్గుచూపినట్లు స్పష్టమవుతున్నది. ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్ పర్సంటేజీ మరింత తగ్గి.. కాంగ్రెస్, బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పలు సర్వేల్లోనూ ఇదే విషయం తేలుతుండడంతో గులాబీ పార్టీ ఓట్లనుతమవైపు తిప్పుకునేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి.
ముక్కోణపు పోటీతో లాభమెవరికి?
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడడంతో ఏడెనిమిది స్థానాల్లోనే ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోరు తమకంటే తమకే కలిసివస్తుందని కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా నమ్ముతున్నది. పాత హైదరాబాద్, -రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ బలంగా కనిపిస్తున్నది. నియోజకవర్గాలవారీగా చూసినప్పుడు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో విజయం సాధిస్తామనే ధీమాలో కమలం పార్టీ ఉన్నా.. ఈ స్థానాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం రేవంత్రెడ్డి తనదైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు.
కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దింపడంతో పాటు వారిని గెలిపించేందుకు ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలందరినీ పిలిచి, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. అభ్యర్థులపరంగా మహబూబ్నగర్, భువనగిరి, నాగర్కర్నూల్, వరంగల్స్థానాల్లో కాంగ్రెస్ కు, బీజేపీకి మధ్య గట్టిపోటీ నెలకొన్నప్పటికీ బీజేపీకి బలమైన కేడర్ లేకపోవడం కాస్త మైనస్. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసినప్పుడు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యత స్పష్టంగా కనిపిస్తున్నది. ఉదాహరణకు కచ్చితంగా గెలుస్తామని బీజేపీ భావిస్తున్న నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 4,08,135 (32.7 శాతం) ఓట్లు, బీఆర్ఎస్కు 4,17,315 (33.4 శాతం) ఓట్లు రాగా.. బీజేపీకి 3,65,374 (29.2శాతం) ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మారిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి చీలే ఓట్లు భారీ మొత్తంలో బీజేపీకి పడ్తేనే సిట్టింగ్ ఎంపీ , అభ్యర్థి ధర్మపురి అర్వింద్గెలిచే అవకాశం ఉంది. ఇక చేవెళ్లలాంటి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ 7,07,456 ఓట్లు, కాంగ్రెస్6,09,527 ఓట్లు సాధించగా.. బీజేపీ 3,35,504 ఓట్లకే పరిమితమైంది.
కాంగ్రెస్లో నిజామాబాద్ నుంచి జీవన్రెడ్డి, చేవెళ్ల నుంచి రంజిత్రెడ్డి లాంటి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈ రెండు చోట్లా నువ్వా? నేనా? అనే పరిస్థితి ఉంది. కాగా.. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో తాము పక్కా గెలుస్తామని, మిగిలిన నియోజకవర్గాల్లో త్రిముఖ పోరుకూడా తమకే అనుకూలిస్తుందని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం తామే అధికారంలో ఉన్నందున ఆయా నియోజకవర్గాల్లో తమ ఓట్లు చీలే అవకాశం లేదని, బీజేపీతో పోల్చినప్పుడు తమ ఓటుబ్యాంకు ఎక్కువ కాబట్టి, బీఆర్ఎస్ నుంచి చీలే ఓట్లు తమకు ఏమాత్రం కలిసి వచ్చినా మరో ఆరు నియోజకవర్గాలనూ కైవసం చేసుకుంటామని ధీమాగా చెప్తున్నారు.