జడ్చర్ల/జడ్చర్ల టౌన్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో తమకు మద్దతివ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ లీడర్పై బీఆర్ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. నసరుల్లాబాద్ తండాలో ఈ నెల 17న పంచాయతీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ మద్దతుతో పాత్లావత్ రాజేశ్, కాంగ్రెస్ మద్దతుతో విస్లావత్ రంజిత్కుమార్ పోటీ చేశారు. అదే తండాకు చెందిన పెంట్యానాయక్ రంజిత్ కుమార్కు మద్దతుగా ప్రచారం చేసి, గెలుపులో కీలకంగా వ్యవహరించాడు.
దీనిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ మద్దతుదారులైన రాత్లావత్ సుమన్, విస్లావత్ సంతోష్ నాయక్, సబావత్ అరవింద్ ఇంటి ముందు కూర్చొని ఉన్న పెంట్యానాయక్పై గురువారం రాత్రి గొడ్డలితో దాడి చేశారు. పెంట్యా నాయక్కు తీవ్రగాయాలు కాగా, అతడిని మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య కేతావత్ అలివేలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్ తెలిపారు.
దాడులు చేయడమే బీఆర్ఎస్ సంస్కృతి
దాడులు చేయడమే బీఆర్ఎస్ సంస్కృతి అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్రెడ్డి విమర్శించారు. మహబూబ్నగర్లోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెంట్యానాయక్ను ఆయన పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకుల దాడిని ఎమ్మెల్యే ఖండించారు.
ఎవరు రౌడీయిజం చేస్తున్నారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రౌడీయిజం చేస్తున్నారని కేటీఆర్ అంటున్నాడని చెప్పారు. పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాంటి ప్రతీకార దాడులకు పాల్పడవద్దని సూచించారు.
