- హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
- మౌనంగా ముఖ్య నేతలు.. కాంగ్రెస్లోకి వలసలు
- ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్
- ఇప్పుడు సీన్ రివర్స్.. ప్యాకప్ పరిస్థితి
హైదరాబాద్, వెలుగు : ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపు క్లోజ్అయింది. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇందులో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్కార్యకలాపాలు ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలోనే ఎక్కువగా ఉంటున్నారు.
వారం రోజుల కింద విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాతన్నా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారా లేక ఆయన కూడా వేరే పార్టీలో చేరుతారా? అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతున్నది. మాజీ మంత్రి రావెల కిశోర్బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాల నుంచి నిరుడు జనవరి 2న పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సిట్టింగ్ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ప్రకటించారు. కానీ, ఏడాది తిరగకముందే సీన్రివర్స్అయింది. సిట్టింగ్ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరడం కాదు కదా ఏపీ బీఆర్ఎస్నేతలే కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలతో టచ్లోకి వెళ్లారు.
హడావుడి చేసి సైలెంట్!
పార్టీని ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా నిరుడు జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను కేసీఆర్ నిర్వహించారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్సీఎంలు పినరయి విజయన్, అర్వింద్కేజ్రీవాల్, భగవంత్సింగ్మాన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా సహా వివిధ పార్టీల నేతలు, ఏపీ బీఆర్ఎస్నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ఎన్నికల్లో తాము గెలిచి ఢిల్లీకి పోతామని, ప్రధాని మోదీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ చెప్పారు. ఆ సభ తర్వాత ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, తిరుపతిలో బీఆర్ఎస్బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. వైజాగ్స్టీల్ప్లాంట్ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏపీ బీఆర్ఎస్నేతలు పాల్గొన్నారు. గుంటూరులో ఏపీ బీఆర్ఎస్అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పార్టీ ఆఫీస్ప్రారంభించారు. మహారాష్ట్రలో పార్టీ ఆఫీసుల ప్రారంభోత్సవాలు, బహిరంగ సభలకు స్పెషల్ఫ్లయిట్లు వేసుకొని వెళ్లిన కేసీఆర్.. గుంటూరులో పార్టీ ఆఫీస్ప్రారంభోత్సవానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర పాలిటిక్స్పైనే దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్ఎస్యాక్టివిటీ తగ్గిపోయింది. నిరుడు ఆగస్టు నుంచి పూర్తిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తలమునకలై ఉండటంతో ఏపీలో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఏపీలో బీఆర్ఎస్కు ముఖ్య నేతలుగా ఉన్న తోట చంద్రశేఖర్, రావెల కిశోర్బాబు, చింతల పార్థసారథి సైలెంట్అయ్యారు. వారు మౌనంగా ఉండటంతో వారి వెంట బీఆర్ఎస్లో చేరిన వాళ్లంతా కొన్ని రోజులుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరారు. ఏపీ సీఎం జగన్ గురువారం హైదరాబాద్కు వచ్చి బీఆర్ఎస్చీఫ్కేసీఆర్ను పరామర్శించారు. కేసీఆర్తో జగన్40 నిమిషాలకు పైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. జగన్పర్యటనకు సంబంధించిన సమాచారం కూడా ఏపీ బీఆర్ఎస్నేతలకు అందలేదు. ఏపీలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండే పరిస్థితే కనిపించడం లేదని భావించి నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు.